కాపు వర్గానికి చెందిన పంచకర్ల రమేష్ బాబు టీడీపీని వీడనున్నారు. అందుకు మూహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇవాళ వైసీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలోనే పంచకర్ల పార్టీ మారుతారని ప్రచారం జరిగిన విషయం విదితమే. కాపు నేతలు తోట త్రిమూర్తులు, బోండా ఉమా, జ్యోతుల నెహ్రులతో కలిసి ఆయన ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో కావచ్చు తన ‘గాడ్ ఫాదర్’ గంటా శ్రీనివాసరావు ఆదేశాలు కావచ్చు కొద్దీ రోజులుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయనకు లోకల్ బాడీ ఎన్నికలలో పార్టీ తీసుకున్న నిర్ణయం మరింత కోపాన్ని తెప్పించింది. లోకల్ బాడీ ఎన్నికలలో పోటీ చేసిన వారికి బీ-ఫామ్ ఇచ్చే అధికారాన్ని తనకు ఇవ్వకుండా వేరే వారికి అప్పగించడంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యాడు.
తాజాగా తమ కార్యకర్తలతో సమావేశమైన ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డితో ఇప్పటికే ఆయన చర్చలు జరిపినట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సీఎం జగన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. అధికార వికేంద్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ను నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనకు నచ్చడంతో వైసీపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖను రాజధానిగా అడ్డుకుంటున్న చంద్రబాబుకు వ్యతిరేకంగానే పార్టీ మార్పు నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
గంటా అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన పంచకర్ల మొదట ప్రజారాజ్యం ఆ తరువాత టీడీపీలో చేరారు. 2014లో యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఘనవిజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికలలో పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాత పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తమ నాయకుడు గంటా వైసీపీలో చేరనున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గంటానే ముందుగా పంచకర్లను వైసీపీకి పంపించారనే వార్తలు కూడా స్థానికంగా వినబడుతున్నాయి. ‘ఆయారాం-గయారాం’ నేతలు సర్వసాధారణమే కానీ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీ మారడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. కాపు సామాజిక వర్గ నేతలు పార్టీని వీడకుండా ఆపాలని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.











