కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. జనానికి సందడిలాగే కనిపించినా.. ఈ బ్రదర్స్ బయటకు వస్తే మాత్రం వారు ఉంటున్న పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా వణికిపోతాయనే చెప్పాలి. ఎందుకంటే.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. వారి నోట నుంచి వచ్చే ప్రతి మాటా తూటాలానే పేలుతుంది. అలాగని వారి మాటలను పట్టించుకోకుండా కూర్చుందామంటే.. అన్నేమో ఎంపీ, తమ్ముడేమో ఎమ్మెల్యే. అధికార టీఆర్ఎస్ కాదు కదా.. ఏ పార్టీకి కూడా వారిని ఓడించే దమ్ము కనిపించడం లేదు. ఇక వారిని భరిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా వారు ఏ తరహా వ్యాఖ్యలు చేసినా.. వారిపై వేటు వేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తోంది. వెరసి.. కోమటిరెడ్డి బ్రదర్స్ హవా అలా నడిచిపోతోంది. ఈ క్రమంలో సెలవు దినం ఆదివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేసీఆర్ సర్కారును టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజీనీమా.. ఆపై పోటీ చేయరట
అయినా కోమటిరెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కేసీఆర్ సర్కారు ఇప్పటిదాకా బిల్లులే చెల్లించలేదట. ఇలా పేరుకుపోయిన బిల్లులు ఏకంగా రూ.1,350 కోట్ల మేర ఉన్నాయట. ఈ బిల్లులు నానా అవస్థలు పడుతున్నారట. బిల్లుల కోసం సెక్రటేరియట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారట. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కోమటిరెడ్డి.. ఆ బిల్లులన్నీ చెల్లిస్తే.. తక్షణమే తన ఎంపీ పదవికి తాను, ఎమ్మెల్యే పదవికి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తామని ఆయన ప్రకటించారు. తన నియోజకవర్గం భువనగిరిలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి అభివృద్ధి చేసినా కూడా తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఇకపై ఎన్నికల్లో పోటీ కూడా చేయబోమని కూడా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. ఈ మాటపై నమ్మకం లేకుంటే ఏకంగా బాండే రాసిస్తానని కూడా ఆయన మరింత సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.
కోటమిరెడ్డి లాజిక్కేమిటో?
కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాల్లో కొనసాగుతూనే పలు కాంట్రాక్టు సంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో వెంకటరెడ్డి ఎప్పుడూ బయటపడలేదు గానీ.. రాజగోపాల్ రెడ్డి మాత్రం తను కాంట్రాక్టర్ నేనని ఓ సందర్భంలో ఒప్పుకున్నారు. రాజకీయాల్లో ఉంటే.. వ్యాపారాలు చేసుకోకూడదా? అని కూడా ఆయన ప్రశ్నించిన వైనం పెను కలకలమే రేపింది. అయితే వీరి సంస్థలు చేసిన పనులకు కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లుగా సమాచారం. ఈ కారణంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేసీఆర్ సర్కారుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారని తెలుస్తోంది. అలాంటిదేమీ లేకుంటే.. ఇప్పటికిప్పుడు ప్రత్యేకించి కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావిస్తారన్న మాట వినిపిస్తోంది.
Must Read ;- హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమే!