విశాఖ కబ్జాలో భాగంగానే జగన్ అండ్ కో ఫ్రాంక్లిన్ కంపెనీని తరిమేశారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఫ్రాంక్లిన్ కంపెనీలో జగన్రెడ్డి రూ. 9 కోట్లు పెట్టుబడిగా పెట్టింది వాస్తవం కాదా? అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి, రాష్ట్రానికి రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని, తద్వారా 12 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. రెండేళ్ల జగన్రెడ్డి పాలనలో ఏపీలో ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
బానిసలుగా వాలంటీర్లు..
నెలకు ఐదువేల జీతంలో 2.9 లక్షల మంది వాలంటీర్లను నియమించి వారిని బానిసలుగా తయారు చేశారని పంచుమర్తి అనురాధ విమర్శించారు. వాలంటీర్ల కన్నా ఉపాధి హామీ కూలీలకే ఎక్కువ కూలీ వస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చంద్రబాబునాయుడు హైదరాబాద్ నగర శివారులో ప్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి 15 ఎకరాలు కేటాయించారని, నేడు ఆ కంపెనీలో 20 వేల మంది పని చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫ్రాంక్లిన్ కంపెనీని మళ్లీ తీసుకురావాలని, ప్రాంక్లిన్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.
Must Read ;- మాన్సాస్పై వైసీపీ నేతల కొత్త పల్లవి.. ఆడిటింగ్ అస్త్రం తెరపైకి