(విశాఖపట్నం నుంచి లియో న్యూస్)
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్పపర్సన్ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి జిఓతో చేపట్టి హైకోర్టులో ఎదురు దెబ్బ తినడంతో వైఎస్ఆర్ సీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్లో అనేక అవకతవకలు జరిగాయని, ఆడిటింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని, ట్రస్ట్ భూములను అశోక్ గజపతి రాజు కొట్టేశారని తల, తోక లేని ఆరోపణలతో తెరపైకి వచ్చారు.
పదవి పోగానే ఆరోపణలు..
సుమారు ఏడాదిన్నర పాటు ప్రభుత్వం నియమించిన వ్యక్తి ఉన్నప్పుడు చేయని ఆడిటింగ్.. ఆ హోదా కాస్తా పోగానే.. అవకతవకల విషయం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర మంత్రులు వివిధ అంశాలపై విశాఖలో రివ్యూ, సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాన్సాస్ ట్రస్ట్పై సరికొత్త ఆరోపణలు చేశారు.దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులు, భూముల ద్వారా మరింత ఆదాయం లభించే విధంగా కొత్త లీజు విధానాన్ని తీసుకువస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా మాన్సాస్ ట్రస్టు నిర్వహణ పారదర్శకంగా లేదని, అకౌంట్లను ఆడిట్ చేయిస్తామని తెలిపారు.
ఎంపీ విజయసాయిరెడ్డి అదే పల్లవి..
‘‘ మాన్సాస్ ట్రస్ట్లో 14 వేల ఎకరాలకు పైగా భూమి ఉంది, 14 విద్యా సంస్థలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మాన్సాస్ ట్రస్ట్కు ఆడిటింగ్ జరగడం లేదు” అని సెలవిచ్చారు. అంతే కాకుండా మాన్సాస్ ట్రస్ట్పై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నట్టు తెలిపారు. ఆడిటింగ్లో అవకతవకలు ఉన్నట్లు తేలితే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని జోస్యం కూడా చెప్పేశారు.మాన్సాస్ ట్రస్ట్లో 135 ఎకరాలు చట్ట విరుద్ధంగా అమ్మకం చేసారని, మాన్సాస్ ట్రస్ట్లో పాత రిజిస్టర్ నుంచి కొత్త రిజిస్టర్ మార్చినప్పుడు అశోక్ గజపతిరాజు 500 ఎకరాలు భూమిని కొట్టేశారని ఆరోపించారు. అశోక్ గజపతిరాజు ప్రజల భూములు, మాన్సాస్ ట్రస్ట్ భూములు ఎలా తిందామా? అని ఎదురు చూస్తున్నారని చెప్పారు.వైసీపీ ప్రభుత్వంలో ఎంత పెద్ద వ్యక్తి భూ ఆక్రమణలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
నెక్ట్స్ టార్గెట్ అదే..
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం తదుపరి వేయబోయే అడుగు ఏంటన్నది ఎంపీ విజయసాయిరెడ్డి చూచాయగా విడుదల చేశారు. ట్రస్టులో ఆడిటింగ్ పేరిట తనిఖీలు చేసి అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసి, మరోమారు ఆయన్ని అభాసుపాలు చేసేందుకు ప్లాన్ వేసినట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. వేలాది ఎకరాల భూములను ధారాదత్తం చేసిన కుటుంబంపై, భూములు కొట్టేశారనే ఆరోపణ చేయడం నీతిమాలిన ఆరోపణగా టిడిపి నేతలు అభివర్ణిస్తున్నారు.
Must Read ;- డామిట్ ! కథ అడ్డం తిరిగింది.. వైసీపీ అర్ధరాత్రి యాక్షన్ ప్లాన్కు బ్రేక్
ఏడాదిన్నరగా చేసింది ఏంటి?
ప్రభుత్వం నియమించిన సంచయిత గజపతిరాజు ఏడాదిన్నరగా మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉన్నారు. నిజంగా ట్రస్టులో అవకతవకలు జరిగి ఉంటే.. ఈ ఏడాదిన్నర సమయం ఆడిటింగ్కు సరిపోదా? అన్న విషయాన్నిఎంపీ స్పష్టం చేయాల్సి ఉందని అశోక్ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఊహించని విధంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సమాధానం ఏం చెప్పాలో అర్థం కాని నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు.అనధికార వ్యక్తులను నియమించి, ట్రస్టుకు, దేవస్థానానికి సంబంధించిన రికార్డులన్నీనెలల తరబడి తనిఖీ చేసి ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో నోరు ఎత్తని నేతలంతా కొత్తగా ఇప్పుడు ఆరోపణలు చేయడం చర్చకు దారి తీస్తోంది. భూములకు సంబంధించిన సమగ్ర నివేదికలు తమ వద్ద ఉంచుకుని వాటిని మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కోర్టు తీర్పు అధికార పార్టీకి గొడ్డలిపెట్టుగా మారింది. ట్రస్ట్ భూములను కాజేసేందుకు సంచైత గజపతిరాజును నియమించారని ప్రచారం అప్పట్లో జరిగింది. అందుకు తగ్గట్టే ఆమె ప్రవర్తనా సరళి కూడా అనుమానాలకు బలం చేకూర్చింది. మరి రానున్న రోజుల్లో ఎటువంటి ఆరోపణలు వినాల్సి వస్తుందో, ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
Also Read ;- కక్ష గట్టి ఇష్టారాజ్యంగా వ్వవహరించారు: అశోక్ గజపతి