ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. నాగార్జున – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఒక సోషియో ఫాంటసీ సినిమా రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నాగార్జున .. పూరి గతంలో ‘శివమణి’ .. ‘సూపర్’ సినిమాలను కలిసి చేశారు. మరోసారి వాళ్ల కాంబినేషన్లో మరో సినిమా రానుందనడంలో విచిత్రమేమీ లేదు .. కానీ అది సోషియో ఫాంటసీకి చెందిన కథ అనే విషయమే ఇక్కడ ఆసక్తికి .. ఆశ్చర్యానికి కారణమవుతోంది. ఎందుకంటే ఫాంటసీలకు .. వాటి తాలూకు విజువల్ ఎఫెక్ట్స్ కు పూరి చాలా దూరం.
పూరి కథలు తన చుట్టూ ఉండే జనంలో నుంచే పుడతాయి. ఆకాశంలో నుంచి ఊడిపడే కథల జోలికి ఆయన వెళ్లడు. కథ .. పాత్రలు తన చేతిలో ఉండి .. తాను చెప్పినట్టుగా వినాలి. తన సినిమా పూర్తికావడమనేది తన నిర్ణయంపై ఆధారపడి ఉండాలి. అందువలన ఆయన కథకి సంబంధించిన ఇతర బాధ్యతలు వేరే వారి చేతిలో లేకుండా చూసుకుంటాడు. ఈ కారణంగానే ఆయన గ్రాఫిక్స్ జోలికి వెళ్లడు. అలా అని చెప్పేసి ఆయన సోషియో ఫాంటసీ చేయడం లేదా? అంటే .. కథను తన స్టైల్ కి తగినట్టుగా మార్చాడని అంటున్నారు. అయితే గతంలో రవితేజ హీరోగా ‘దేవుడు చేసిన మనుషులు’ అనే ఫాంటసీ మూవీ చేశాడాయన. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ పూరీ ఇప్పుడు మరోసారి ఫాంటసీ సినిమా చేయబోతుండడం ఆసక్తిగా మారింది.
ప్రాచీనకాలానికి చెందిన ఒక రాజు .. ఒకానొక చిత్రమైన పరిస్థితుల్లో భూలోకానికి వస్తాడట. అలా వచ్చిన ఆయన గతంలో తాను అనుభవించిన రాజరికాన్ని ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తాడట. ఆ సందర్భంలో చోటుచేసుకునే ఆసక్తికరమైన పరిణామాలతో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. లాక్ డౌన్ సమయంలో తాను సరదాగా రాసిన ఈ కథను నాగార్జునకి పూరి వినిపించడం, ”బాగుంది .. చేద్దాం” అని ఆయన అనడం జరిగిపోయాయని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Must Read ;- అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజు అస్తమయం