ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు కన్నుమూశారు. ఆదివారం ఆయనకు గుండెపోటు రావడంతో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. వీఎంసీ ప్రొడక్షన్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా. ఆ తర్వాత అన్నమయ్య, సింహద్రి వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. పంపిణీదారుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు. వీఎంసీ సంస్థను విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఏయన్నార్ తో రెండు సినిమాలు, నాగార్జునతో మూడు సినిమాలు,ఎన్టీఆర్ తో ఒక సినిమా నిర్మించారు. శ్రీకాంత్, జగపతిబాబు, మాధవన్ లతోనూ సినిమాలు నిర్మించారు. దాదాపు 750 సినిమాలకు పంపిణీదారుడిగా వ్యవహరించారు.
పంపిణీ రంగంలో ఆయనను రాయలసీమ రారాజుగా పిలిచేవారు. వీఎంసీ సంస్థలకు ఆయన వ్యవస్థాపకుడు. వీఎంసీ ప్రొడక్సన్స్, వీఎంసీ పిక్చర్స్, వీఎంసీ ఫిలిమ్స్, వీఎంసీ 1 కంపెనీ, వీఎంసీ పిక్చర్ ప్యాలెస్.. ఇలాంటి పేర్లతో ఆయన సంస్థలు ఉన్నాయి. నగిరి మాజీ ఎమ్మెల్యే కూడా. టీటీడీ బోర్డు సభ్యుడిగా, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా, డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ ఛైర్మన్ గా, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పలు పదవులు నిర్వహించారు. ఆయన నిర్మించిన సీతారామయ్యగారి మనవరాలు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. అలాగే అన్నమయ్య చిత్రానికి ఎన్నో అవార్డులు లభించాయి.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన గురుశిష్యులు సినిమాతో ఆయన 1978లో పంపిణీదారుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1987లో నిర్మాతగా కిరాయి దాదా ఆయన తొలిచిత్రం. నిర్మాతగా పది చిత్రాలు నిర్మించారు. ఆయన మరణించిన వార్త తెలియగాని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు సింహాద్రి లాంటి మంచి హిట్ సినిమా ఇచ్చారు. అనేక విజయవంతమైన చిత్రలు నిర్మించడమే కాదు బుల్లితెరపైనా వెలుగు పంచారు. తమిళంలోనూ, హిందీలోనూ డబ్బింగ్ చిత్రాలను అందించారు. ఆయన పార్థివ దేహాన్ని రేపు ఉదయం 8 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తెస్తారు.. రేపు 11 గంటలకు ఫిల్మ్ నగర్ లో ఉన్న మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయి.
Must Read ;- లక్ష్మీపార్వతి ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడా?