గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తి గతంగా తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొందరు స్వార్థంతో, రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. నీచమైన , నిరాధారమైన విషయాలతో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, దీనిపై సైబర్ నేరాల కింద ఫోటోలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీపి సెలవులో ఉండటంతో అడిషనల్ సీపి పూజకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు
సీఎం నా చిరకాల మిత్రుడు
సీఎం కేసీఆర్ తన చిరకాల మిత్రుడని అన్నారు. తాను ఓడినా సీఎం ఆసాధారణ రీతిలో క్యాబినెట్లో చోటు కల్పించారని చెప్పారు. తనకు ఇతర పార్టీల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నాళ్లయినా ఓపికతో సీఎంతోనే ఉంటానన్నారు. కొంత మంది వాళ్ల రాజకీయ సుస్థిరత కోసం నీచమైన పద్ధతులు అవలంబిస్తున్నారని అన్నారు. కలిసి వచ్చో, ఆదృష్టవశాత్తో పదవులు రావచ్చు… కాని ఆ పదవులను అప్రతిష్ట పాలు చేయవద్దన్నారు. కొందరు వాళ్ల స్వార్ధం కోసం పార్టీ అభ్యర్దులను కూడ ఓడించారని తెలిపారు. తాను రాజకీయాలు చేయలేక మౌనంగా ఉండలేదని, తాను ఇలాంటి దుష్ట రాజకీయాలు చేయనన్నారు.
ఎక్కడ ఉన్నా జిల్లా అభివృద్ధికి కృషి..
తాను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, తన జీవితం ప్రజలకు తెలుసని అన్నారు. ఏ పార్టీలో ఉన్నా జిల్లా అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా. ఓడినా ప్రజల కోసం పని చేశానన్నారు. ఖమ్మం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు తెచ్చినట్లు చెప్పారు. రూ.కోట్ల నిధులు తెచ్చి సీతారామ , భక్త రామదాసు ఎత్తి పోతల పథకాలు నిర్మించినట్లు తెలిపారు. జాతీయ రహదారులను అభివృద్ధి చేశామన్నారు.
సీఎంను ఖమ్మం తీసుకొచ్చా..
ఖమ్మం పట్టణానికి సీఎంను తీసుకొచ్చి వివిధ అభివృద్ధి పనులకు నిధులు తెచ్చామన్నారు. ఖమ్మం మంచినీటి పథకానికి రూ.250 కోట్లు తెచ్చామన్నారు. దీంతో ఇంటింటికి మంచినీరు ఇచ్చే అవకాశం లభించిందన్నారు.రూ.100 కోట్లతో గోళ్లపాడు ఛానల్ (మురికి కాలువ) ను అభివృద్ధి చేశామన్నారు. ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ, ఖమ్మం ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుస్తుందని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు.
Must Read ;- ఖమ్మం గులాబీ కార్పొరేటర్లపై సీఎం కేసీఆర్ సీక్రెట్ సర్వే!