( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
32 మంది ప్రాణత్యాగాలు, వేలాదిమంది ప్రజల ఉద్యమ స్ఫూర్తి కారణంగా సాకారమైన ‘ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ పక్కా స్కెచ్ ప్రకారం ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇచ్చిన సమాధానంతో ఈ బండారం బయట పడింది. 2018లో పోస్కో , హుండై ప్రతినిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించారని స్పష్టం చేసింది. ఆర్ఐఎన్ఎల్, ఎన్ఎండిసి, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ప్రతినిధులు ప్లాంట్ భూములను పరిశీలించినట్టు లేఖలో పేర్కొంది. స్టీల్ ప్లాంట్ భూముల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పోస్కో సంస్థ ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించింది. ఒక నాన్ బైండింగ్ ఎంవోయు కూడా 2019 అక్టోబర్లో కుదుర్చుకున్నట్టు స్పష్టం చేసింది. ఎంవోయూ ప్రకారం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసినట్టు, సమాచార మార్పిడికి వర్కింగ్ గ్రూప్ పని చేస్తోందని స్పష్టం చేసింది. ఎంవోయూ ప్రకారం స్టీల్ ప్లాంట్ లో కనీసం 50 శాతం వాటాను పోస్కో దక్కించుకోనుంది. ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు దఫదఫాలుగా పోస్కో ప్రతినిధులు విశాఖ సందర్శించినట్లు లేఖలో పేర్కొన్నారు. పోస్కోకు కేటాయించిన భూముల విలువ ఆధారంగా స్టీల్ ప్లాంట్లో వాటా నిర్ధారించాలని ఒప్పందంలో రాసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

ముగియని పోస్కో వ్యవహారం..
కార్మికుల ఆందోళనతో పోస్కో వ్యవహారం ముగిసిందని అంతా భావించారు. దక్షిణ కొరియా కంపెనీకి ప్లాంట్ భూములు ఇచ్చేది లేదని ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన రూపంలో సమాధానం ఇవ్వడంతో అనంతరం ఆ చర్చ ముందుకు సాగలేదు. కానీ ఎంవోయూ కుదుర్చుకున్న విషయం విజయసాయిరెడ్డి ప్రశ్నతో వెలుగులోకి వచ్చింది. ఆ ఒప్పందాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రైవేటీకరణ ప్రతిపాదనతో స్పష్టమైంది.
బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం..
ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నుంచి నూరు శాతం వాటాలు ఉపసంహరించుకుని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే… ఒక రకంగా విక్రయించడమే. ఇందు కోసం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి త్వరలో టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. అందులో అత్యధికంగా కోట్ చేసిన సంస్థకు స్టీల్ ప్లాంట్ పై హక్కులు లభిస్తాయి. ఈ లెక్కన ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న పోస్కో సంస్థకు 50 శాతం వాటాలు వెళ్లిపోతాయా? లేక ఆ సంస్థ కూడా బిడ్డింగ్లో పాల్గొంటుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
50 శాతం వాటా ఇచ్చేందుకే డ్రామాలా?
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ఉద్యోగులు పోస్కోను తీవ్రంగా వ్యతిరేకించారు. అదే విధంగా ఇతర రాజకీయ పార్టీలు ప్రైవేటు భాగస్వామ్యం సహించేది లేదని స్పష్టం చేశాయి. కమ్యూనిస్టులు చాలా రోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు. దీంతో తాత్కాలికంగా ఆ వివాదానికి తెర దించి, పూర్తి ప్రైవేటీకరణ ప్రతిపాదన తెరపైకి తెస్తే… చర్చల్లో భాగంగా 50 శాతం పోస్కోకు అప్పగించేందుకు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు.. అంగీకరిస్తాయనే కుట్రతోనే కేంద్రం ఈ ప్రకటన చేసి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యమం తారస్థాయికి చేరిన తరువాత చర్చల పేరిట ఇటువంటి ప్రతిపాదన చేసే అవకాశం ఉందని, పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే కన్నా…50 శాతం వెళ్లడం ఉత్తమమని ఉద్యోగులే భావించేలా చేయడమే కేంద్రం పన్నాగమని భావిస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలోనే ప్రతినిధులు ఈ మొత్తం వ్యవహారం నడిపారు. ప్రస్తుతం కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలు వెనుక రహస్యం ఏంటన్నది త్వరలోనే వెల్లడి కానుంది. అనుకోకుండా విజయసాయిరెడ్డి ఈ ప్రశ్నలు వేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
Must Read ;- నన్ను నమ్ముకో.. అన్నీ అమ్ముకో..: జగన్ ప్రతిపాదనపై ఉద్యోగుల ఆగ్రహం











