(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటో త్వరలోనే తేలుతుంది. పరిశ్రమ స్థాపన కోసం ఎటువంటి ఉద్యమం పురుడుపోసుకుందో .. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అంతకుమించిన ఉద్యమం ఉద్భవించాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకోసం ఇప్పటికే కార్మిక సంఘాలు, ఉద్యోగులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా… ఈ తరుణం ఒక్క ఉక్కు ఉద్యోగుల భవితవ్యంమే కాదు… రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి ద్విపాత్రాభినయానికి ఒక క్లారిటీ ఇవ్వనుంది.
కేంద్రాన్ని ఎదిరించే దమ్ము ఉందా?
స్టీల్ ప్లాంట్ వద్ద వేలాదిగా చేరుకున్న ఉద్యోగులను ఉద్దేశించి అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలు చేశారు. పార్లమెంటులో ఈ అంశంపై పోరాడుతామని ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఇది సాధ్యమేనా? అన్న ప్రశ్న, అనుమానం కలగకమానదు. నెలల తరబడి ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్రం నుంచి లభిస్తున్న స్పందన ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. అనేక కేంద్రం నిర్ణయాలకు… నో చెప్పలేక.. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. సిబిఐ కేసులు వేగవంతం అయి… ఏడాదిలోపే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తీర్పులు వచ్చే పరిస్థితి ఉంటుందన్న భయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో కేంద్రం ఎన్ని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నా నోరు మెదప లేని పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్ని విధాల మొండిచెయ్యి లభించినా, నిలదీయలేని స్థితి అధికార పార్టీ ఎంపీలది. మరి విశాఖ ఉక్కు గురించి పోరాటం చేయగల తెగువ ఉన్నపళంగా వస్తుందని ఆశించగలమా?
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఎమ్మెల్యే గంటా రాజీనామా
నాడు 35 నేడు.. 22…
“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. వీళ్లంతా కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పితే… ఉద్యమం మరింత ఉగ్రరూపం దాలుస్తోందని భయపడిన అప్పటి ఇందిర ప్రభుత్వం విశాఖకే స్టీల్ ప్లాంట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్నేళ్ల తర్వాత రాష్ట్ర విభజన జరిగి, నవ్యాంధ్ర లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న అధికార పార్టీ ప్రస్తుతం ఉన్న కేంద్రంపై ఏ మేరకు ఒత్తిడి చేయగలదు అన్నది ఆ పార్టీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
పార్లమెంటులో 22 మంది అధికార పార్టీ ఎంపీలతో పాటు… తెలుగుదేశం పార్టీ ఎంపీలు జతకలిసి ఆందోళనకు దిగితే… దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తుంది అనడంలో సందేహం లేదు. ఇందుకోసం పార్లమెంటులో చాలా పెద్ద రగడ సృష్టించాల్సి ఉంటుంది. అలా చేస్తే కేంద్రం వైఎస్సార్సీపీపై కన్నెర్ర చేస్తుంది. అలాగని మన్ను తిన్న పాములా ఉంటే.. రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ దశలో జగన్ అండ్ కో ఏవిధంగా ముందుకు వెళుతుంది అన్నదానిపై… నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు…
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా అధికార పార్టీ నేతలు ప్రకటనలు చేసి.. ఎన్నికలు ముగియగానే… ఏరు దాటాక తెప్ప తగలేసే రకం గా వ్యవహరించినా .. పెద్ద వింతేమీ కాదని ఆ పార్టీ వ్యవహారశైలి తెలిసిన ఎందరో అంచనా వేస్తున్నారు. అదే వ్యూహంతో వైసిపి ముందుకు వెళితే.. గ్రేటర్ ఎన్నికల తో పాటు ఇతర ఎన్నికల్లోనూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read ;- విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. కాపాడుకుందాం రండి