‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అంటూ రాయప్రోలు సుబ్బారావు చెప్పినట్లు విశ్వనాథ సత్యనారాయణ ఎవరు ఎక్కడ తిరిగినా తన సంస్కృతిని, సంప్రదాయాన్ని విడిచిపెట్టరాదని,
‘పక్షి రోజంతా సముద్రం మీద తిరిగినా రాత్రికి తన గూటికి చేరుతుంది’ అని భారతీయులు ఏ దేశంలో ఉన్నా తన వారసత్వ సంపద అయిన సంస్కృతి, సంప్రదాయాలను విడనాడరాదని నొక్కి వక్కాణించారు. దానిని ఆయన ఒక పద్యరూపంలో ఆవిష్కరించారు.
‘అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్”
—విశ్వనాథ సత్యనారాయణ
గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథకు తన ప్రతిభ పైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాki. తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నారు విశ్వనాథ. జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి, ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాథ అనేవారు. శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవారు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకొనేవారు.
విశ్వనాధుని 44 వ వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత సాహితీ శిఖరం గురించి లియో న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జ్ఞానపీఠం పురస్కారంను తెలుగు సాహిత్యంను సుసంపన్నం చేసిన విశ్వనాధ సత్యనారాయణ 1970 లొనే అందుకున్నారు. జ్ఞానపీఠం పురస్కారం అందుకున్న తొలి ఆంధ్రుడు కావడం ఆంధ్రులు గర్వించాల్సిన విషయం. విశ్వనాధుడు 25 కావ్యాలు, పదిహేను వందల నాటకాలు, 88 నవలలు, తొమ్మిది విమర్శనా గ్రంధాలు, రెండువందల కండికలు, వందకుపైగా పీఠికలు రాసారు. భారతీయ సంప్రదాయ వైభవాన్ని చాటిచెప్పిన వేయి పడగలు ఆయన రాసిన నవల్లో ఒకట ఆణిముత్యం. ఇదే ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డును సాధించి పెట్టింది. దీనిని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు సహస్రఫణి పేరిట హిందీలో సంక్షిప్త అనువాదం చేసారు. భారతీయ సంస్కృతి,విశేషాలను ఈ నవల్లో వివరించడంతో పాటుగా మధ్య తరగతి కుటుంబీకుల జీవితాన్ని నవల్లో పొందుపరిచారు.
ఎన్నెన్నో పురస్కారాలు
విశ్వనాధుడు 1895 సెప్టెంబర్ 10న కృష్ణాజిల్లా నందమూరు లో జన్మించారు. ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. గుడివాడలో గజారోహణసన్మానo, రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డులతో పాటు ఆంధ్రాయూనివర్సిటీలో కళాప్రపూర్ణ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందుకున్నారు. ఆయన అందుకున్న పదవులకు, పురస్కారాలకు, బిరుదులకు అంతే వన్నె తెచ్చారు.
విజయవాడలో విగ్రహం ఆవిష్కరణ
1995లో జరిగిన విశ్వనాధుడు సాహితి శతజయంతి ఉత్సవాల్లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ విశ్వనాధ సత్యనారాయణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించారు.
విజయనగరంలో సాహిత్య గోష్టి
సాహిత్య శిఖరం విశ్వనాథ సత్యనారాయణ 44 వ వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరం జిల్లా జామి మండలం అట్టాడలోని బిఎన్ఆర్ అశ్రమంలో ‘విశ్వనాధుని వేయిపడగలు’ పై సాహిత్య గోష్టి నిర్వహించి స్థానిక సాహితీవేత్తలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.











