(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఢరేంజ్ పరిధిలో అరుదైన చిలుకలు విస్తారంగా ఉన్నాయి. జిల్లా నుంచి వీటిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించకుండా ఉండేందుకు ‘ఆపరేషన్ పారాకిట్స్’ పేరిట చర్యలు చేపట్టింది. 2014 నుండి చేపట్టిన ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది చిలుకల సంఖ్య ఘననీయంగా పెరగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిలుకలు నవంబరులో గుడ్లు పెడతాయి. మార్చి నెలలో పిల్ల చిలుకలు రెక్కలు తొడిగి ఎగిరిపోతాయి. ఈ అయిదు నెలలు వీటిని ఎవరూ పట్టుకోకుండా, అపహరించకుండా అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు.
ప్రత్యేక సిబ్బందితో సంరక్షణ
2013లో పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హిర మండలం ప్రాంతం నుంచి 214 చిలుకలను ఓ ముఠా కారులో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అరుదైన చిలుకలుగా వీటిని గుర్తించి ప్రభుత్వ సూచనల మేరకు పాలకొండ అటవీ రేంజ్ పరిధిలో చిలుకల ప్రత్యేక సంరక్షణ బాధ్యత చేపట్టారు. అందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
ఆపరేషన్ పారాకిట్స్
2014 నుంచి చిలుకలు అక్రమంగా తరలి పోకుండా అటవీశాఖ ‘ఆపరేషన్ పారాకిట్స్’ పేరిట చర్యలు చేపట్టింది. గతంలో ఏడాదిలో కేవలం అయిదు నెలలు మాత్రమే ప్రత్యేక సిబ్బందిని వీటి సంరక్షణకు నియమించే వారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చిలుకల సంరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టారు. పాలకొండ రేంజ్ పరిధిలోని 16,735 హెక్టార్లలో ఆపరేషన్ పారాకిట్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా నవంబరు నుంచి మార్చి వరకు అయిదుగురు సిబ్బంది దీని కోసం నియిమించేవారు. ఈ ఏడాది చిలుకల సంఖ్య పెరగడంతో ఏప్రిల్ నుంచి మరో ఇద్దరిని అదనంగా నియమించారు.
స్థావరాలపై ప్రత్యేక నిఘా
ఈ ప్రాంతం నుండి చిలుకలు అక్రమంగా తరలిపోకుండా స్థావరాలపై అటవీశాఖ అధికారులు నిఘా ఉంచుతున్నారు. నిరంతరం రక్షణ చేపడుతున్నారు. గతంలో కంటే రేంజ్ పరిధిలో చిలుకల సంఖ్య పెరగడంతో, ఇవి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలను సాధిస్తున్నారు.
పాలకొండ అటవీ రేంజ్ పరిధిలోని సీతంపేట అటవీ ప్రాంతంలో ఇవి సంచరిస్తూ స్థానికులను, ముఖ్యంగా పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతం ఇటీవల పిక్నిక్ స్పాట్ గా కూడా మారుతోంది.