హఫీజ్ పేట భూవివాదం నేపథ్యంలో..బోయిన్ పల్లిలో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ కోసం చేసిన పలు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, మరో నిందితుడు మాడాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వారు ‘ఇంకా’ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అఖిల ప్రియ బయటకు వస్తే.. సాక్ష్యాల తారుమారవుతాయని పోలీసుల తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. దీంతో ఇప్పటివరకు మూడుసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది న్యాయస్థానం. సోమవారం మరోసారి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలపై పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి.. కేసు పురోగతిని వివరించడం కూడా ప్రాధాన్య అంశంగా మారింది. అయితే ఈ కేసు విషయంలో రాజకీయంగా పలు కోణాల్లో చర్చ జరుగుతోంది. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
- అఖిల ప్రియ బయటకు వస్తే.. సాక్ష్యాలు తారుమారు అవుతాయనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘నిందితులు అందరూ పట్టుబడితేనే బెయిల్ వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది’.. నిందితులు దొరకకుండా బయటే ఉంటే బెయిల్ రావడం కష్టం అవుతుంది.’ అయినప్పటికీ బెయిల్ రాలేదంటే.. వేరే నేరం చేసే ఉద్దేశం గాని, వేరే పరిస్థితులు తలెత్తుతాయనిగాని కారణంగా భావించవచ్చు. లేదా మరో కేసులో న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. నిందితులు దొరికితే బెయిల్ రావడం ఈజీ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అనుమానాలూ వస్తున్నాయి. ఎందుకంటే.. గతంలో ఏపీలో అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్ తో పాటు పలు కేసుల్లో పూర్తి స్థాయిలో నిందితులు దొరకలేదన్న కారణం బెయిల్ అంశంపై ప్రభావం చూపింది.
- ఇక అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ తో పాటు ఆయన తల్లి కిరణ్మయికి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉందన్న అనుమానాల నేపథ్యంలో.. భార్గవ్ రామ్/అఖిల ప్రియ పాత జీవితానికి సంబంధించిన ఇష్యూలేమైనా ఉన్నాయా అనేది కూడా తెరపైకి వస్తోంది.
- హఫీజ్ పేటలో భూ వివాదాలు, ఘటనలు చాలానే జరిగాయి. అయితే ఈకేసు కేవలం అఖిలప్రియచుట్టూనే తిరుగుతుంది. కిడ్నాప్ ఘటన కాబట్టి.. అఖిలప్రియ అండ్ కో చుట్టూ తిరుగుతుందని చెప్పినా.. ఇంత భారీ విలువ ఉన్న భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామని గాని, ప్రత్యేక కమిటీ లేదా కార్యాచరణ వైపు అడుగులు వేసే విధంగా ప్రభుత్వం ముందుకు రాలేదు. బీజేపీ కూడా ఇదే యాంగిల్ లో ప్రశ్నలు లేవెనెత్తింది. ఈ భూములు ప్రభుత్వానివని, అఖిల ప్రియకు లేదా ప్రవీణ్ రావుకు సంబంధం లేదని, మొత్తం విచారణ జరపాలని డిమాండ్ చేసింది. వారి డిమాండ్ ఎలా ఉన్నా.. భారీ ఆర్థిక విలువ ఉండడం, ప్రజల్లో పలు అనుమానాలు తెలెత్తిన నేపథ్యంలోనూ ప్రభుత్వంనుంచి కీలకమైన అడుగులు పడకపోవడం పలు అనుమానాలకు, ఆరోపణలకు కారణం అవుతోంది. అంటే కొందరు పెద్దలు ఇందులో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
- ఇదే కేసులో.. కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలు, కథనాలకు తరువాత కొన్ని గంటల్లోనే పోలీసులు ప్రెస్ మీట్ లలో చెప్పిన సమాచారం కచ్చితంగా ఉంటుంది. ఇదేదో కాన్ఫిడెన్షియల్ సోర్స్ అని వారు చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మీడియా పరిస్థితి, తటస్థంగా, నిజాయితీగా ఉండే ఆ ‘కాన్ఫిడెన్సియల్ ’ సోర్స్ ఏంటనేదే ప్రశ్నగా మారింది. ఆ లీకులన్నీ.. నూరు శాతం అఖిలప్రియకు యాంటీగా ఉంటున్నాయి. అదే మీడియాలో ఈ భూముల వ్యవహారం పై కనీస వార్తలూ రావు.
- ఇక ఈ కేసులో పోలీసుల విచారణ జాబితాలో ఉంటున్నవిగా చెప్పిన పేర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డికి ప్రమేయం లేదని పోలీసులు చెప్పినట్లు.. స్వయంగా సుబ్బారెడ్డి కుమార్తె వీడియో విడుదల చేశారు. ఈ కేసులో సుబ్బారెడ్డి దూరంగా ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటివరకు 19మందిని అరెస్టు చేశారు. అయితే వీరి గత జీవితంలోని వ్యక్తులు లేదా రాజకీయ, ఆర్థిక, కుటుంబ, వ్యాపార ప్రత్యర్థులు (చాలామంది ఉన్నట్లు సమాచారం) అఖిల ప్రియకు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
- ఈ కేసులో అఖిల ప్రియ కుటుంబంనుంచి ప్రస్తుతం బయట ఉన్నది ఆమె చెల్లెలు మౌనిక రెడ్డి మాత్రమే. జగత్ విఖ్యాత్ రెడ్డికీ ఈ కేసుతో సంబంధం ఉందని తేలడంతో.. ఆమె ఒక్కరే ప్రస్తుతం బయటివ్యవహారాలు చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.











