లాభల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ చేయాల్సిన అగత్యమేమిటి?
సింగరేణి బోగ్గు గనులు నష్టాలు.. కష్టాలు అనే వార్తలు గత శతాబ్ధ కాలంలో చాలా రేర్! దేశంలోనే లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలో సింగరేణిది ప్రప్రథమ స్థానం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో లాభాల్లో నడుస్తున్న సింగరేణి ప్రతి ఏటా కార్మికులకు బోనస్ లను ప్రకటిస్తోంది. వచ్చే లాభల్లో కార్మికులకు షేర్ ను బోనస్ రూపంలో ప్రకటించి, ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వం రంగం సంస్థ కూడా సింగరేణే. అటువంటి సింగరేణి సంస్థపై కేంద్రం కన్నుపడింది. ప్రైవేటీకరణ చేసి, ఆ తరువాత హోల్సేల్ గా అమ్మెయ్యాలని చూస్తోందని కార్మికుల ఆరోపిస్తున్నారు. నష్ట్రాల్లో ఉన్న సంస్థలను భరించలేమని ప్రైవేటీకరణ రాగాన్ని కేంద్రం అందుకుంటున్న సహజం! అటువంటిది లాభాల్లో సాగుతూ.. సిరుల మాగాణిగా పేరుగాంచిన సింగరేణిని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరమేమి వచ్చిందని కార్మికులు నిలదీస్తున్నారు. ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉద్యమ బాటపట్టిన సింగరేణి కార్మికులు..
బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం అడుగులను కార్మిక సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తొలిసారిగా సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘం సైతం సమ్మెకు దిగింది. బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. మొత్తం సింగరేణినే బ్లాక్ చేశారు కార్మికులు. దేశంలో 88 బొగ్గు గనులుండగా .. తెలంగాణలోని కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసి – 3, శ్రావణపల్లి ఓసీ, కేకే -6 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు 72 గంటల సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏరియాలు, నాలుగు రీజియన్ల పరిధిలో 25 ఓపెన్ కాస్టులు, 20 భూగర్భ గనుల్లో డంపర్లు, డోజర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మొదటి, రెండు షిఫ్టుల్లో మొత్తం 34,777 మంది కార్మికుల్లో అత్యవసర సేవలు నిమిత్తం కొంతమంది మినహాయిస్తే.. మొత్తం 29,247 మంది కార్మికులు విధులను బహిష్కరించి, సమ్మె బాటపట్టారు. తొలిరోజు గురువారం రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిపోయి రూ.100 కోట్లు నష్టం వాటిల్లగా, శుక్రవారం కూడా అదే నష్టాన్ని చివిచూసింది.
చర్చోప చర్చలు సారాంశం ..
అన్ని కార్మిక సంఘాలతోపాటు సింగరేణి గుర్తింపు పొందిన టీబీజీకేఎస్ కూడా సమ్మెలో భాగస్వామ్యమైంది. అన్ని సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి 12 డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని నినదించాయి. హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ వద్ద గురవారం కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే కార్మిక సంఘాల 12 డిమాండ్లలలో ఏ ఒక్కదానికి యాజమాన్యం అంగీకరించలేదని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ సీతారామయ్య తెలిపారు. ఇదిలా ఉంటే సింగరేణి కార్మికుల మవోలు మద్దతు తెలిపారు. సింగరేణి కోల్ కమిటీ అధికార ప్రతినిధి ప్రభాత్ పేరిట లేఖ విడుదలైంది. సీఎం కేసీఆర్ కూడా ఇప్పటీకే ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు.
Must Read ;- ఇక కేసీఆర్ కు తీన్మారేగా..!











