తెలంగాణ అనగానే చాలామందికి సింగరేణి గుర్తుకొస్తుంది. సింగరేణి వేలాది కార్మికులకు ఉపాధి కల్పించడమే కాకుండా.. రాజకీయాలకు సైతం కేంద్రబిందువుగా నిలుస్తోంది. ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం, గోదావరిఖని, మందమర్రి, మంచిర్యాల, చెన్నూరు, రామగుండం ఏరియాలు సింగరేణి పరిధిలోకి వస్తాయి. అయితే మొదట్నుంచీ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఇక్కడి కార్మికులకు, యూనియన్లకు జవాబుదారీగా ఉంటూ తన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. బొగ్గు గని కార్మికుల సంఘాలు సైతం ప్రభావితం చేస్తున్నారు. సింగరేణి ఎన్నికల్లో చక్రం తిప్పుతూ పైచెయ్యి సాధిస్తున్నారు.
సీతక్క గురి..
ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు మంచి పేరుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాపై సీతక్కకు మంచి పట్టుంది. ఇప్పటికే పలు సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్నుంచీ సీతక్క మరింత జోరును ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గానికి పరిమితమైన సీతక్క సింగరేణిపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రేవంత్ సాయంతో సింగరేణి యూనియన్ ఎన్నికల్లో గెలువాలని వ్యూహాలు రచిస్తోంది. కొత్త బాస్ రేవంత్ కు, సీతక్కల మధ్య మంచి సంబంధాలు కలిగి ఉండటం కూడా ఇందుకు కారణం.
కవితను ఢీకొడుతుందా..?
తెలంగాణలో దాదాపు సగం వరకు సింగరేణి ప్రాంతం ఉంది. కోల్ బెల్ట్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదని చెప్పాలి. ఇప్పటివరకు కవితనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కవితకు చెక్ పెట్టేందకు రేవంత్ రెడ్డి సీతక్కను బరిలోకి దించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి ని గెలిపించే బాధ్యత సీతక్క కు అప్పగిస్తారని పార్టీ వర్గాల సమాచారం కూడా. సీతక్క అయితేనే కవితను సమర్థవంతంగా ఎదుర్కోగలదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సీతక్క కూడా ఆసక్తి చూపుతుండటంతో ఇక సింగరేణి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఒకవేళ కవితను సీతక్క ఓడిస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరింత కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
Must Read ;- రేవంత్ దూకుడు.. టీఆర్ఎస్ కు ముచ్చెమటలు!