తెలంగాణ రాష్ట్ర సమితికి అప్పుడే 20 ఏళ్లు నిండిపోయాయి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునే లక్ష్యంతో ఉద్యమ పార్టీగా 2001 ఏప్రిల్ 27న పురుడుపోసుకుంది. అప్పటి నుంచి 14 ఏళ్ల పాటు అలుపెరగని ఉద్యమం సాగించిన టీఆర్ఎస్.. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి.. తెలంగాణ ప్రజల చిరకాల కలను సాకారం చేసింది. ఆపై కొత్తగా రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంటనే వరుసగా మరోమారు తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టింది. ఇక ఆ పార్టీ అధినేతగా 20 ఏళ్ల పాటు నాన్ స్టాప్గా కొనసాగుతూ వస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణకు తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడమే కాకుండా.. రాష్ట్రానికి వరుసగా రెండో పర్యాయం కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 20 ఏళ్ల పాటు ఓ పార్టీకి అధ్యక్షత వహించడమంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఓ ప్రాంతీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా ప్రస్థానం సాగించిన టీఆర్ఎస్ పగ్గాలు 20 ఏళ్లుగా కేసీఆర్ చేతుల్లోనే ఉండటం కూడా గమనార్హమే. అయితే ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పగ్గాలను వేరే వారికి అప్పగిస్తారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
25న అధ్యక్షుడి ఎన్నిక
టీఆర్ఎస్ విధి విధానాల ప్రకారం రెండేళ్లకోమారు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా విజృంచక ముందు నాటి వరకు రెగ్యులర్గానే అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తూనే వచ్చిన టీఆర్ఎస్.. కరోనా కారణంగా చాలా కాలం క్రితమే జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఇటీవలే పార్టీ సంస్థాగత ఎన్నికలు అన్నింటినీ పూర్తి చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించేశారు. ఈ మేరకు బుధవారం టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా మొదలు కానుంది. 23న నామినేషన్ల పరిశీలన పూర్తి కానుంది. 25న పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
నామినేషన్లు పడతాయా?
20 ఏళ్లుగా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ వస్తున్న సీఎం కేసీఆర్ ఈ దఫా కూడా ఆ పదవికి నామినేషన్ వేస్తారా? లేదా? అన్న దిశగా కొత్త చర్చకు తెర లేసింది. స్వయంగా కేసీఆరే నామినేషన్ దాఖలు చేయకున్నా.. వేరే వారితో ఆయన పేరిట నామినేషన్ వేయించడం అయితే ఖాయమనే చెప్పాలి. ఇదంతా తెలిసిన విషయమే అయినా.. ఈ సారి పార్టీ అధ్యక్ష పదవికి వేరే ఎవరైనా నామినేషన్ వేస్తారా? లేదా? అన్న విషయమే ఆసక్తికరంగా మారింది. వేరే వారెవరూ నామినేషన్ వేయకున్నా.. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కేటీఆర్కు పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పగించే దిశగా కేసీఆర్ వ్యూహం రచించారా? అన్న దిశగా కూడా కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే సీఎంగా తన స్థానంలో తన కుమారుడిని కూర్చోబెట్టాలని కేసీఆర్ చాలా కాలం నుంచే యోచిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం ఆయనను ఆపేస్తోంది. అయితే కేటీఆర్ మాత్రం ఇటు మంత్రిగా, అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో రాణిస్తూ పార్టీ వ్యవహారాలపై పూర్తిగానే పట్టు సాధించారని చెప్పాలి. ఇలాంటి క్రమంలో పార్టీని పూర్తిగా కుమారుడికి అప్పగించే దిశగా కేసీఆర్ ఈ దఫా చర్యలు చేపడతారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
Must Read ;- కూతురి దెబ్బకు కేసీఆర్ దిగొచ్చారే











