ముంబయికి చెందిన కాదంబరీ జెత్వానీ కేసులో ఆమెను వేధించిన ఐపీఎస్ అధికారులపై వేటుకు రంగం సిద్ధం అవుతోంది. వేటు అంటే కేవలం సస్పెండ్ చేసి వదిలేయడం కాకుండా.. వారు చేసిన మాఫియా తరహా అఘాయిత్యాలకు ఏకంగా డిస్మిస్ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లుగా తెలిసింది. ఆ హీరోయిన్ ను వైసీపీ నేతలు తమ ప్రయోజనం కోసం వేధించిన వ్యవహారంలో ఈ ముగ్గురు ఐపీఎస్ లు కూడా భాగం అయ్యారు. ఆ ఘటన జరిగిన ఇన్నాళ్లకు జెత్వానీ కేసులో వైసీపీ కుట్ర మొత్తం బట్టబయలు అయిపోయింది. ఇప్పుడు ఏపీ పోలీసుల ఆధారాలతో సహా అన్ని సాధించారు.
వేటుకు గురవుతున్న వారిలో కాంతిరాణా టాటా (విజయవాడ మాజీ సీపీ), విశాల్ గున్ని (మాజీ డీసీపీ), పీఎస్ఆర్ ఆంజనేయులు (ఇంటెలిజన్స్ మాజీ చీఫ్) ఉన్నారు. కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన దొంగకేసును విచారించే సమయంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు… తనను తీవ్రంగా వేధించారని బాధితురాలు వాపోయింది. జెత్వానీకి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఎప్పుడో పరిచయమే కానీ.. ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసు ఉత్తి బూటకమని పోలీసులు తేల్చారు. పైగా భూమి అమ్మకాలు, డాక్యుమెంట్లతో ఆమెకు ఏ సంబంధం లేదని.. అవి పోలీసులే తయారు చేశారని గుర్తించారు. జెత్వానీ అమ్మకానికి పెట్టారంటున్న భూమికి అడ్వాన్స్ ఇచ్చారని పోలీసులు పేర్కొన్న వ్యక్తి.. స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. అసలు తనకు జెత్వానీ ఎవరో తెలియదని.. ఆమెకు తాము డబ్బులివ్వలేదని స్పష్టత ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లు రెడీ చేసిన రైటర్ కూడా.. తనను బెదిరించి పోలీసులు ఈ డాక్యుమెంట్లు తయారు చేయించారని చెప్పేశారు.
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఈ కేసు నమోదవడానికి ముందే తన బృందంతో ముంబైకి వెళ్లారు. జత్వానీ ఇంటిదగ్గర రెక్కీ చేశారు. రెండో తారీఖు కేసు నమోదు కాగానే ఆమెను ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకొని విజయవాడకు తీసుకొచ్చారు. అందుకోసం వారికి స్టార్ హోటల్స్ లో బస, లగ్జరీ కార్లను ఏర్పాటు చేశారు. ఏవరు ఏర్పాటు చేశారో కూడా వివరాలను పోలీసులు బయటకు తీశారు. జెత్వానీ కుటుంబాన్ని విజయవాడకు తీసుకు రావడం, 40 రోజుల పాటు నిర్బంధించడం.. కోర్టులో రిమాండ్ విధించిన విషయం కూడా బయటకు తెలియకుండా జాగ్రత్తపడటంతో మొత్తం గూడుపుఠాణిపై క్లారిటీ వచ్చేసింది.
ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు చేసిన ఇదంతా పూర్తి అధికార దుర్వినియోగం. ఇలాంటి నేరాల్లో పట్టుబడితే వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేలా చర్యలు ఉంటాయని అంటున్నారు. వారు చేసిన నేరాలు చాలా తీవ్రమైనవవి కాబట్టి, సర్వీస్ నుంచి తీసేయించేలా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేస్తుందని అంటున్నారు. అదీకాక, ఈ ముగ్గురు ఐపీఎస్ లపై ఇదొక్క ఆరోపణే కాక, వారి ట్రాక్ రికార్డ్ అంతా అధికార పార్టీ కోసం పని చేసినట్లే ఉంది. అందుకే వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.