ఏలూరులో వింతవ్యాధి కలకలం సృష్టంచిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక సంస్థలు అధ్యయనం చేసి, ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాలను వెల్లడించారు. దీనిపై సీఎంను కూడా గందరగోళానికి గురిచేశారు. దీంతో ఏలూరు వింత వ్యాధి కారణాలను నిగ్గు తేల్చేందుకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ వేశారు. నెల రోజులు అధ్యయనం చేసిన కమిటీ నివేదిక సమర్పించింది. ఏలూరులో వింత వ్యాధికి కారణం స్థానికులు తినే కూరగాయల్లో ఆర్గానో క్లోరైడ్లు అధికంగా ఉండడమే అని కమిటీ తేల్చి చెప్పింది. దీంతో ఏలూరు వింత వ్యాధికి కారణాల మూలాలను కనుగొన్నట్టయింది.
దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలు
ఏలూరులో వింతవ్యాధి కారణాలను వెలికితీసేందుకు నెల రోజుల పాటు అధ్యయనం చేసిన ఉన్నతస్థాయి కమిటీ, వింతవ్యాధికి కారణం కూరగాయలేనని తేల్చింది. ఏలూరు మార్కెట్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా కూరగాయలు తీసుకెళ్లడం వల్ల దెందులూరు వంటి ప్రాంతాల్లోనూ వింతవ్యాధి ప్రబలిందని ఉన్నతస్థాయి కమిటీ అభిప్రాయపడింది. కూరగాయల్లో అధిక మోతాదులో ఆర్గానో క్లోరైడ్, ఆర్గానో పాస్పైట్లు ఉండటం వల్లే ఇలా జరిగిందని తుది నిర్ణయానికి వచ్చారు. అయితే కొన్ని జాగ్రత్త చర్యలను కమిటీ సూచించింది. కార్లు శుభ్రం చేసిన నీరు ఏలూరు కాలువలో కలవకుండా చూడాలని వారు సూచించారు. వ్యవసాయ రసాయనాలు కలసిన నీరు కూడా మంచి నీటి కాలువల్లో కలవ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరికొన్ని నెలలపాటు ఉభయగోదావరి జిల్లాల్లో మంచినీటి శాంపిల్స్ సేకరించి తరచూ పరీక్షలు చేయాలని కమిటీ సూచించింది.
Must Read ;- రీ ఎంట్రీ : ఏలూరులో మరల వింత వ్యాధి కలకలం
వాడకం లేదు, ఎలా చేరింది?
వ్యవసాయరంగంలో చాలా కాలంగా ఆర్గానో క్టోరైడ్లను నిషేధించారు. వాటి వాడటం లేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వ్యాధి లక్షణాల్లో మాత్రం ఆర్గానో క్టోరైడ్ల ప్రభావాలే కనిపించాయని నిపుణులు బలంగా నమ్ముతున్నారు. వింతవ్యాధిబారిన పడిన వారు రెండు, మూడు రోజుల ముందు వరకు మాంసాంహారం తీసుకోలేదని, వారు కేవలం కూరగాయలు, పాలు, పండ్లు మాత్రమే తీసుకున్నారని గుర్తించారు. ఇవన్నీ పరిశీలించిన నిపుణులు ఆర్గానో క్లోరైడ్లు కూరగాయల వల్లే శరీరంలో ప్రవేశించాయని బలంగా నమ్ముతున్నారు. శరీరంలో ప్రవేశించిన 24 గంటల తరవాత ఆర్గానో క్లోరైడ్లు పరీక్షలు చేసినా బయట పడదని కమిటీ అభిప్రాయపడింది. కూరగాయల ద్వారానే ఆర్గానో క్లోరైడ్లు ఏలూరు వాసుల శరీరంలో ప్రవేశించాయనే అభిప్రాయానికి వచ్చారు.
కలుపు నివారణ మందు కొంప ముంచిందా?
పంటల సాగులో కలుపు నివారణ చాలా కీలకం. అయితే కూలీల కొరత కారణంగా కలుపు నివారణకు రైతులు విరివిగా కలుపు నివారణ మందులు వాడుతున్నారని తేలింది. అయితే కలుపు నివారణ మందులు పిచికారి చేస్తే వింతవ్యాధి కేవలం ఏలూరుకే పరిమితం అయ్యేది కాదని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవని కమిటీ అభిప్రాయపడింది. ఒక వేళ కూరగాయలు ఏలూరు మార్కెట్ కు చేరిన తరవాత కలుషితం అయ్యాయా? అనే అనుమానాలు కూడా కమిటీ వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఏలూరు వింత వ్యాధికి కూరగాయల కలుషితం కావడమే కారణంగా ఉన్నత స్థాయి కమిటీ తేల్చింది.
భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి
పంటల సాగులో రసాయనాల వినియోగం తగ్గించడంతోపాటు, పూర్తిగా సిక్కిం తరహాలో సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఆ దిశగా వ్యవసాయశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇది దీర్ఘకాలంలో ఫలితాలిస్తుంది. అయితే ప్రస్తుతం కొన్ని జాగ్రత్తలను కమిటీ సూచించింది. రసాయనాలు తాగే నీటిలో కలవ కుండా జాగ్రత్త పడటం, తరచూ మంచినీటి శాంపిల్స్ లో రసాయలను గుర్తించే పరీక్షలు చేయడంతోపాటు, పంటల సాగులో వాడే రసాయనాల నాణ్యతను కూడా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షించాలని సూచించారు. ఏలూరు కాలువను శుభ్రం చేయాలని కూడా కమిటీ అభిప్రాయపడింది. ఇవన్నీ అమలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి వింతవ్యాధులు ప్రబలే అవకాశం ఉండదని నిపుణుల కమిటీ సూచించింది.
Also Read ;- వైసీపీ సర్కారు తీరు.. పీహెచ్సీల్లో రోగుల దిగులు











