(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో నిర్వహణ లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర మందుల కొనుగోలు, ఆస్పత్రుల కనీస నిర్వహణకు ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులనూ ఖర్చు చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉండటం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించక పోవడమేనని తెలుస్తోంది. ట్రెజరీల ద్వారా చెల్లింపులు చేయాలన్న సరికొత్త నిబంధన విధించడం, ఆస్పత్రి అభివృద్ధి కమిటీల ప్రతిపాదనలతో జరగాలన్న మెలికతో నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందని వినికిడి. దీంతో అత్యవసర సేవలు, ఇతర ఖర్చులను వైద్యులు, సిబ్బందే భరించాల్సి వస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.
మూలుగుతున్న నిధులు
విజయనగరం జిల్లాలో 68 పీహెచ్సీలకు అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కమిటీలుండేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రద్దయ్యాయి. కానీ నూతన కార్యవర్గాలను ఇంతవరకూ నియమించలేదు. అందువల్ల జాతీయ గ్రామీణ ఆరోగ్య శాఖ విడుదల చేసే లక్షల రూపాయలు ఖర్చు చేయలేకపోతున్నారు. గత రెండేళ్లుగా కేంద్రం విడుదల చేసిన నిధులు పీడీ ఖాతాల్లో మూలుగుతున్నాయి. కొన్ని పీహెచ్సీల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉండవు. అటువంటి వారు జిల్లా కేంద్రం నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి ఖర్చులు అభివృద్ధి కమిటీ ఆమోదంతో విడుదల చేసేవారు. అభివృద్ధి కమిటీలు లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది సొంత ఖర్చులతో మందులు తీసుకెళ్లాల్సి వస్తుండటంతో వారు చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల రోగులకు అత్యవసర పరిస్థితుల్లో మందులు అందడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్లిష్ట సమయంలో..
అసలే కరోనా సమయం. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాల్సిన అవసరముంది. పీహెచ్సీల్లో కనీస నిర్వహణ, అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయో? లేవో చూసుకోవాలి. కానీ జిల్లాలో చాలావరకూ ఆస్పత్రుల నిర్వహణ అక్కడున్న సిబ్బందికి భారంగా మారుతోంది. పారిశుధ్యం, చిన్నచిన్న అవసరాలకు కూడా నిధుల కొరత వెంటాడుతోంది. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు సక్రమంగా ఖర్చు చేయాల్సిన అవసరముంది. వీలైనంత త్వరగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీలను నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా ఆలోచించాలని స్థానికులు కోరుతున్నార.
Must Read ;- ఏలూరు వింత వ్యాధిపై సర్కారు విచిత్ర వాదన..!