ఏలూరులో ప్రబలిన వింత వ్యాధికి కారణాలను అణ్వేషించే పనిలో నిపుణుల బృందాలు కొంత వరకు పురోగతి సాధిస్తున్నాయి. తాజాగా వచ్చిన నివేదికలో తాగునీటిలో మోతాదుకు మించి డైక్లోరోమిథైన్ను గుర్తించారు. ఏలూరు వ్యాప్తంగా 20 తాగునీటి శాంపిల్స్ను హైదరాబాద్లోని ఓ ల్యాబ్కు పరీక్షలకు పంపించగా ఫలితాలు వచ్చాయి. తాగునీటిలో డైక్లోరోమిథేన్ 5 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చని, కానీ ఏలూరులో పలు ప్రాంతాల్లో తీసుకున్న శాంపిల్స్లో 200 ఎంజీ నుంచి 900 ఎంజీ వరకు ఉన్నట్టు రిపోర్టుల్లో తేలింది. దీంతో తాగునీరు కలుషితం వల్లే వింతవ్యాధి వ్యాపించిందని నిపుణులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
పెరుగుతున్న బాధితులు
ఏలూరులో వింతవ్యాధి బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 16 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. దీంతో మొత్తం వ్యాధి బాధితుల సంఖ్య 606కు చేరింది. వీరిలో 534 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. మరో 34 మందిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆసుప్రత్రులకు తరలించారు. మిలిగిన వారికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా వింతవ్యాధి కేసులు అధికం కావడంతో ఏలూరు వాసులు కార్పొరేషన్ సరఫరా చేసే మంచినీరు తాగాలంటేనే వణికిపోతున్నారు. చాలా మంది ఆర్వో నీరు కొనుగోలు చేసుకుని తాగుతున్నారు. ఆర్వో నీటిలో కూడా డైక్లోరో మిథేన్ ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాగునీటిలోకి డైక్లోరోమిథేన్ ఎలా చేరింది
ఏలూరు ప్రజలు తాగే నీటిలో డైక్లోరోమిథేన్ మోతాదు మించి ఎలా చేరిందనే దానిపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పెయింట్స్ తొలగించేందుకు వాడే రసాయనాలు, జుట్టుకు వేసే రంగు, పెయింట్స్లో డైక్లోరోమిథేన్ ఉంటుందని, వాటిని వినియోగించడం వల్ల అవశేషాలు తాగునీటిలో చేరుతున్నాయని ప్రాథమికంగా గుర్తించారు.
Must Read ;- ట్రీట్ చేస్తూ డాక్టర్లు పడిపోతున్నారు.. ఇది ఇంకో మహమ్మారేనా?

కీలక నివేదికలు ఈరోజు వచ్చే అవకాశం
ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఏలూరులో బాధితులు, వారి నివాసాల నుంచి తీసుకున్న శాంపిల్స్ ను హైదరాబాద్లోని ఎన్ఐఎన్కు పంపించారు. ఆ నివేదిక ఇవాళ వచ్చే అవకావం ఉంది. ఎన్ఐఎన్ నివేదిక వస్తే తినే ఆహారంలో, తాగే నీటిలో విష రసాయనాలు ఎంత ఉన్నాయనేది నిగ్గుతేలనుంది. ఇక సిద్దార్దా మెడికల్ కాలేజీ బృందాలు కూడా ఏలూరులో పర్యటించాయి. వారు కూడా అనేక శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్లోని ల్యాబ్లకు పంపించగా, ఆ నివేదికలు కూడా ఇవాళ రానున్నాయి. నివేదికలు అన్నీ వస్తే వాటిని విశ్లేషించి నీటిలో, తినే ఆహారంలో ఏఏ రసాయనాలు ఉన్నాయి. ఏ రసాయనం వల్ల వింతవ్యాధి ప్రబలిందనే విషయం తేలనుంది.
కూరగాయల్లోనూ పురుగు మందుల అవశేషాల గుర్తింపు
కేవలం తాగునీటిలోనే కాకుండా కూరగాయాల్లోనూ పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు తేలింది. అయితే ఈ నివేదికలను రహస్యంగా ఉంచాలని ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధనా మండలి కోరింది. కూరగాయలపై వచ్చిన నివేదికలను బహిర్గతం చేయవద్దని, ఆన్లైన్ ద్వారా ఢిల్లీలోని కేంద్ర వ్యవసాయ పరిశోధనా మండలికి పంపాలని ఆ సంస్థ కోరింది. రైతులు పురుగు మందులు పిచికారి చేయగానే వెంటనే కూరగాయలు కోసి మార్కెట్లకు తరలిస్తున్నారని గుర్తించారు. పురుగు మందులు పిచికారి చేసిన తరువాత కనీసం 72 గంటలు కూరగాయలను కోయకూడదు. కానీ ఈ నిబంధన ఎవరూ పాటించడం లేదు. మూడు రోజులకు ఒకసారి కూరగాయల పంటలపై పిచికారి చేయడం, వెంటనే కూరగాయలు కోసి మార్కెట్లకు తరలించడం రైతులకు అలవాటుగా మారింది. పిచికారి చేసిన రసాయనాల ప్రభావం మొదటి మూడు రోజులు తీవ్రంగా ఉంటుంది. అలాంటి కూరగాయలను సరిగా కడగకుండా వండుకుని తింటే ఆ విష రసాయనాలు శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని నివేదికలు వస్తే వింతవ్యాధి గుట్టు బయటకు రానుంది. ఆ తరవాత ఏలూరు ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also Read ;- జీవనశైలి, రోగ నిరోధక శక్తి.. కరోనాకు ఆ నాలుగు పల్లెలు దూరం











