‘ఎన్టీఆర్’ ఈ మూడక్షరాల ఈ పేరు.. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ చరిత్రను శాసించింది. తెలుగు రాజకీయంపై చెరగని ముద్ర వేసింది. దేశ రాజకీయాలను కొత్త పుంతలు తొక్కించింది. తెలుగు వాడికి పరిచయమై ఏడు దశాబ్దాలు దాటినా.. ప్రతి గుండె గుడిలోనూ నేటికీ పూజలందుకుంటోంది. పేదవాడి గుండె చప్పుడుగా మారింది. తెలుగు వాడు ఈ పేరుని ఇంతలా ఆరాధించడానికి కారణమేంటి? ఏముంది ఆ మనిషిలో? మహాత్మా గాంధీ సైతం మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో.. మరణించి పాతికేళ్లవుతున్నా.. చెక్కు చెదరని ఆ ఇమేజ్ కు కారణమేంటి? ఓ కథానాయకుడిగా ఆయన సాధించిన ఘనతా? లేదా.. ఓ మహానాయకుడిగా ఆయన చూపించిన తెగువా? అంటే.. ఇదీ.. అని కచ్చితంగా చెప్పలేని స్థితి. ఓ మహోన్నతమైన వ్యక్తిగా, తిరుగులేని శక్తిగా ఆయన సాధించిన ఘనతలు ఒకటా.. రెండా.. ఎన్నో.. ఎన్నెన్నో.. ఎన్ని చెప్పినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఎంత విన్నా.. ఇంకా వినాల్సింది ఎంతో ఉంటుంది. ఎన్ని పుస్తకాలు చదివినా.. తెలుసుకోవలసింది కొండంత మిగిలే ఉంటుంది.
పాలవాడిగా మొదలై.. పాలకుడిగా మారి..
ఎన్టీఆర్ జీవితం నేటి యువతకి ఆదర్శం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే నానుడి బహుశా ఎన్టీఆర్ నుంచే పుట్టిందేమో! తండ్రికి సహాయంగా పాలమ్మిన వ్యక్తి.. తదనంతర కాలంలో సినీ రంగంలోకి అడుగుపెట్టి.. తిరుగులేని కథానాయకుడిగా మూడు దశాబ్దాలపాటు తెలుగు సినీ సామ్రజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలాడు. జానపథ కథానాయకుడిగా నాటి యువతను ఉర్రూతలూగించాడు. కలల రాకుమారుడిగా నిలిచాడు. శ్రీకృష్ణుడు, శ్రీమహావిష్ణువు, రాముడు, భీముడు, అర్జునుడు, శివుడు, వేంకటేశ్వరుడు, భీష్ముడు లాంటి పురాణ పాత్రలతో మెప్పించి.. తెలుగు వారి ఇంట దేవుడిగా వెలిశాడు. ఈ క్రమంలో వచ్చిన లవకుశ సినిమా.. ఈ తారకరాముడ్ని ఆ కోదండరాముడిగా మార్చేసింది. ఈ సినిమా సాధించిన కొన్ని రికార్డులైతే.. ఇప్పటికీ చెక్కు చెదర లేదు. ఎక్కువ టిక్కెట్లు తెగిన తెలుగు సినిమాగా ఇప్పటికీ చరిత్రలో నిలిచే ఉంది. ఈ సినిమాకు దాదాపు 16 కోట్ల టిక్కెట్లు తెగాయని ఓ అంచనా! అంటే.. ఇప్పటి కలెక్షన్ల లెక్కల ప్రకారం చూసుకుంటే.. 16 వందల కోట్లకు పైగా వసూలు చేసిందన్నమాట!
Must Read ;- తారకరాముడి పట్టాభిషేకానికి 38 ఏళ్లు..
అవతార పురుషుడు.. ఈ తారకరాముడు!
మహా విష్ణువు 11వ అవతారంగా ఎన్టీఆర్ ను కొలిచేవారు జనం. తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రతి తెలుగువాడూ.. నాడు అటు నుంచి అటే మద్రాసు వెళ్లి ఈ కలియుగ వేంకటేశ్వరుడ్ని కూడా దర్శించుకునే వాడు. రాముడిగా, కృష్ణుడిగా ఆయన ఫొటోలను మతాలకు అతీతంగా ప్రతి ఇంట్లోనూ పూజ గదిలో ఉంచుకుని పూజించేవారు. ఈ స్థాయి.. ప్రపంచంలో ఏ నటుడికీ లేదు. దేవుడి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఎన్టీఆర్.. పురాణాల్లోని ప్రతినాయక పాత్రలకు కూడా అదే స్థాయిలో ఇమేజ్ తీసుకొచ్చారు. రావణాసురుడిగా, కర్ణుడిగా, సుయోధనుడిగా, కీచకుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. వారిలోని మంచి గుణాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా.. వారిని హీరోలుగా మార్చాడు. దానవీరశూర కర్ణలో కర్ణుడు, సుయోధనుడి పాత్రలను మలచిన విధానమే ఇందుకు నిదర్శనం. ఆ సినిమాలో ఈ పాత్రలు మరణించేటప్పుడు కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. ఆ స్థాయిలో ఆ పాత్రలకు జీవం పోశారాయన. అలాగే, రావణుడిలోని ఓ గొప్ప వ్యక్తిని ప్రేక్షకులకు పరిచయం చేశారు ఎన్టీఆర్.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
ఎన్టీఆర్ కేవలం నటుడు మాత్రమే కాదు. గొప్ప సృజనాత్మకత కలిగిన ఓ సృష్టికర్త. మహా దర్శకుడు. గొప్ప రచయిత. అద్భుతమైన నిర్మాత. 16 సినిమాలకు ఆయన దర్శకత్వం వహిస్తే.. ఒకటి రెండు మినహా.. దాదాపు అన్నీ హిట్సే. అన్నీ కళాఖండాలే. ఎందరో గొప్పగొప్ప నటులను, సాంకేతిక నిపుణులను తెలుగు తెరకు పరిచయం చేశారాయన. చారిత్రక పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, చాణక్య చంద్రగుప్త లాంటి సినిమాలతో చారిత్రక విజయాలు అందుకున్న ఆయన.. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాతో ఓ కొత్త చరిత్రనే సృష్టించారు. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్టో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. జనం బళ్లుకట్టుకుని తండోపతండాలుగా ఈ సినిమా చూడడానికి వచ్చేవాళ్లు.
Also Read ;- వెండితెరకు వెలుగులద్దిన ధ్రువ‘తారక’ రాముడు (ఎన్టీఆర్ 25 వర్ధంతి)
సాంఘికాల్లోనూ సరికొత్త చరిత్ర
పౌరాణిక, జానపద, చారిత్రక సినిమాలే కాదు.. సాంఘిక పాత్రలతోనూ ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఆ సినిమాలతోనూ సంచలనాలు సృష్టించారు. గుండమ్మకథ, మిస్సమ్మ, కథానాయకుడు, దేశోద్దారకులు, గుడిగంటలు, రక్తసంబంధం, ఆత్మబంధువు, కలసి ఉంటే కలదు సుఖం, నిప్పులాంటి మనిషి, ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం, తల్లా పెల్లామా లాంటి సినిమాలతో సాంఘికాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ఇక కలర్ యుగంలోనైతే ఆయనకు తిరుగులేదనే చెప్పొచ్చు. అడవిరాముడి నుంచి హీరోగా ఆయన ఇమేజ్ ఆకాశాన్ని దాటిపోయింది. వేటగాడు, యమగోల, డ్రైవర్ రాముడు, గజదొంగ, యుగంధర్, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి సినిమాలతో తారాపథంలో దూసుకెళుతుండగానే సినిమాలకు స్వస్తి చెప్పి.. ప్రజాసేవ బాటపట్టారు. ఎన్టీఆర్ మొత్తం 302 సినిమాల్లో నటించగా.. అందులో.. దాదాపు 240 పైచిలుకు సినిమాలు హిట్సే. ఈ రికార్డు ఏ హీరోకీ లేదు. ఇక ఉత్తమ నటుడిగానూ, దర్శకుడిగానూ, నిర్మాతగానూ ఆయన రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.
చరిత్రాత్మకం.. ఆయన రాజకీయ ప్రస్థానం..
అది 1982.. మార్చి 29.. తెలుగు సినిమా రారాజు ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజు. హైదరాబాద్ లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ లో.. ఉద్విగ్నభరిత వాతావరణంలో.. ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తూ.. తన పార్టీ పేరును ప్రకటించారు ఎన్టీఆర్. ‘తెలుగుదేశం పార్టీ’.. ఈ పేరే అప్పట్లో ఓ సంచలనం. రాజకీయాల్లో ఆయన వేసిన ప్రతి అడుగూ ఓ ప్రభంజనం. 19 రోజుల్లో రాష్ట్రంతా పర్యటించి.. ఓ ప్రజా ప్రభంజనం సృష్టించారు. కేవలం 9 నెలల్లోనే అధికార పగ్గాలు అందుకుని గిన్నీస్ రికార్డల్లోకి ఎక్కారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భాషకు మించి ప్రాచుర్యం పొందారు. ఆ ప్రాచుర్యం ఎలాంటిదంటే.. తెలుగు భాషకు ఎన్టీఆర్ లాంగ్వేజీగా విదేశాల్లో గుర్తింపు దక్కేంత. నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్.. స్వయంగా ఎన్టీఆర్ గెలుపు గురించి ఆరా తీశారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆయన ఖ్యాతి ఏ స్థాయిలో ఉండేదో! నాటి ప్రధాని ఇందిరను ఎదిరించి, గెలిచి, నిలిచిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్.
Also Read ;- ఎన్టీఆర్ అమర్ రహే!: ముత్తాతకు మునిమనవడి శ్రద్ధాంజలి
సంక్షేమానికి ఆద్యుడు..
దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. టీడీపీ నినాదమే.. పేదవాడికి కూడు, గుడ్డ, నీడ అందించడం. ఇందుకోసం ఆయన అహరహం శ్రమించారు. నాడు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవి. పేదవాడికి అన్నం ఎలా ఉంటుందో కూడా తెలియని రోజులు. గంజి.. లేదంటే జొన్న సంగటి. ఇది తప్ప మరో ఆహారం తెలియదు వాడికి. ఇలాంటి స్థితిలో అలాంటి వారికి అన్నం రుచి చూపించారు ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. ఈ పథకాన్ని నాటి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఖజానా ఖాళీ అయిపోతుందన్నారు. అయినా ఎన్టీఆర్ పట్టించుకోలేదు. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అప్పట్లో ఈ పథకాన్ని తీవ్రంగా విమర్శించారు. పేదరికం పోగొట్టడానికి ఇది మార్గం కాదన్నారు. దీనివల్ల ప్రజలు సోమరిపోతులవుతారు అన్నారు. కానీ, ఆ తర్వాత కాలంలో ఆయనే ఈ పథకాన్ని మెచ్చుకున్నారు. పేదరికం తొలగించేందుకు ఇంతకన్నా మార్గం లేదంటూ అన్నగారిపై పొగడ్తల వర్షం కురిపించారు. నాడు విమర్శించిన కాంగీయులే ఆ తర్వాత కాలంలో రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం విశేషం.
ఇక అన్నగారి మరో పథకం.. జనతా వస్త్రాల పంపిణీ. పేదవారికి సగం ధరకే చీరలు, దోవతులు అందించారు ఎన్టీఆర్. అందరూ ఒంటి నిండా బట్టలు ధరించేలా చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఇక పక్కా ఇళ్లు. అన్నగారు అధికారంలోకి రాకముందు వరకు పేదలకు ప్రభుత్వం గుడిసెలు మాత్రమే కట్టించేది. అది కూడా గోడలు లేని గుడిసెలు. గాలి వీస్తే ఎగిరిపోయే గుడిసెలు. ఎన్టీఆర్ అధికారం చేపట్టగానే.. ఆ గుడిసెల స్థానంలో వారికి స్లాబ్ తోటి మూడు గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇలా కొన్ని లక్షల ఇళ్లు నిర్మించారు ఎన్టీఆర్. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక గ్రామాల్లో ఏళ్లుగా పాతుకుపోయిన పటేల్, పట్వారీ వ్యవస్థని ఒక్క రాత్రిలో రద్దు చేసి సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. వాటి స్థానే మండల వ్యవస్థను తీసుకొచ్చి.. రెవెన్యూలో పెను మార్పులు చేశారు. పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చారు. రైతులకు రూ. 50లకే హార్స్ పవర్ విద్యుత్తు అందించారు. ఇక మహిళల కోసం ఆయన చేసినంతగా ఎవరూ చేసి ఉండరు. వారికి ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీని స్థాపించారు.
దేశంలోనే తొలి మహిళా యూనివర్సిటీ ఇదే కావడం గమనార్హం. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. దాన్ని తన ఇంటి నుంచే మొదలెట్టారు. అప్పుడెప్పుడో 1984లో ఆయన చేసిన ఈ చట్టాన్ని.. 2004లో కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయడం విశేషం. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలు.. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ అమలు చేసినవే కావడం విశేషం. నాడు ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గ్రామీణ క్రాంతి పథకమే నేటి స్వచ్ఛభారత్. అప్పట్లోనే ఎన్టీఆర్ తెలుగు మహిళా బహిర్భూమి పథకంతో ప్రజలకు మరుగుదొడ్లు కట్టిస్తే.. ఇప్పుడు మోదీ అదే పని చేస్తున్నారు. అలా ఎన్టీఆర్.. నాటి తరం నుంచి నేటి తరం వరకు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే.. ఆయన మరణించి పాతికేళ్లు దాటినా.. ఆ ఇమేజ్ చెక్కు చెదరలేదు.
Also Read ;- లక్ష్మీపార్వతి ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడా?
నిజాయితీకి నిలువుటద్దం!
ఎన్టీఆర్.. అవినీతిని సహించేవారు కాదు. తను మాత్రమే నిజాయితీగా ఉండడం కాదు.. తన మంత్రివర్గంలోనూ, పార్టీలోనూ, చివరికి కుటుంబంలోనూ అందరూ నిజాయితీగా ఉండాలని కోరుకునే వారు. ఓ సందర్భంలో తన మంత్రివర్గంలోని ఓ మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసి.. అతడిపై నిఘా ఉంచారు. అతడు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టించారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే.. ఓ ఏసీబీ డైరెక్టర్ లంచం తీసుకుంటుండగా స్వయంగా పట్టుకుని సస్పెండ్ చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అలాగే, ఆయన అప్పుడప్పుడూ మారువేషాలు వేసుకుని ఆకస్మిక తనిఖీలకు వెళ్లేవారు. అలా ఓసారి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తిరుపతి రుయా డైరెక్టర్ ను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రిగా తన వాహనాన్ని కుటుంబసభ్యులు వినియోగిస్తే.. ఎన్టీఆర్ సహించేవారుకారు.
విశాల దృక్పథం ఉన్న గొప్ప జాతీయవాది
ఎన్టీఆర్ కు ఆవేశపరుడిగా పేరు. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఆవేశంలో తీసుకుంటుంటారని అందరూ అంటుంటారు. కానీ, మంచి ఆలోచనా పరుడని, విశాల దృక్పథం కలవారని అప్పట్లో ఆయన పీఎస్ గా పనిచేసిన జయప్రకాశ్ నారాయణ అంటుంటారు. ఓ సందర్భంలో.. కర్ణాటకతో ఆంధ్రకు జలవివాదం ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రకు నీళ్లు వదిలేందుకు నిరాకరించింది. అప్పుడు తెలుగుదేశం నాయకులంతా ఎన్టీఆర్ ను కలిసి కర్ణాటక వెళ్తామని, నెత్తుటేరులు పారించైనా.. నీళ్లు తీసుకువస్తామని ఎన్టీఆర్ తో అన్నారు. అప్పుడు అక్కడే ఉన్న జేపీ.. ఈ మాటలకు కంగారు పడ్డారు. ఎన్టీఆర్ ఆవేశంతో సరే అంటారేమోనని భయపడ్డారు. కానీ, ఎన్టీఆర్.. చాలా నింపాదిగా నాయకులను శాంతపరచి.. వారికి హితబోధ చేశారు. ‘‘కర్ణాటకను పాలిస్తోంది ఎవరు? పాకిస్తాన్ వాళ్లా? చైనా వాళ్లా? వాళ్లు కూడా భారతీయులే కదా! అక్కడి వాళ్లూ మన వాళ్లే కదా.. ముందు వాళ్లనే నీళ్లు వాడుకోమందాం. మిగిలినవే మనం తీసుకుందాం’’ అని సర్ది చెప్పారు. వెంటనే కర్ణాటక సీఎంతో ఫోన్లో మాట్లాడి.. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలియడానికి అని అంటారు జేపీ. ఇప్పుడున్న రాజకీయ నాయకుళ్లా.. ఆయన స్వార్ధంతో ఆలోచించేవారు కాదు.
ప్రాంతీయ తత్వాలను, మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసే వారు కాదు. నీతి నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజాసేవకు అంకితమైన గొప్ప మానవతావాది ఎన్టీఆర్. ఒక్క అవినీతి మరక కూడా అంటని సచ్ఛీలుడు ఎన్టీఆర్. నిజంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎన్టీఆర్ అవసరం ఉంది. ఆయన లాంటి నాయకత్వం అవసరం ఉంది. ఢిల్లీ గద్దెకు మొక్కుతున్న మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్క సారి ఆయన జీవిత పాఠాన్ని చదివి .. ఆ సారాన్ని ఒంటబట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మనిషి ఈ భూమ్మీద తిరుగాడాడంటే.. భవిష్యత్తులో మన తెలుగు వాళ్లు కూడా బహుశా నమ్మరేమో! దేవుడు తన కోసం, తన రూపంలో, తనకు నచ్చిన విధంగా చెక్కుకున్న శిల్పం ఆయన. దేవుడు చేసిన బంగారు మనిషి మన ఎన్టీఆర్.
Also Read ;- అన్నా.. మళ్లీ ఎప్పుడు పుడతావు!