దేశభక్తి నేపథ్యంలో సాగే ఓ సినిమాను విజయశాంతి చేయనుందనీ, ఆమె ప్రధానపాత్రధారిగా ఆ సినిమా నడుస్తుందనే టాక్ చాలా రోజులుగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే సమయం ఆసన్నమైనట్టుగా తెలుస్తోంది. ప్రతిమ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆమె ‘భారతరత్న’ సినిమా చేయనుంది. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కాశ్మీర్ లో మేజర్ పార్ట్ షూటింగు జరుగుతుందని అంటున్నారు.
దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారు? అనేది త్వరలోనే తెలియనుంది. ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. విజయశాంతి కెరియర్ ను పరిశీలిస్తే, దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఆ తరహా పాత్రలను చేయడం వల్లనే ఆమె లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఒకానొక దశలో స్టార్ హీరోలతో సమానమైన వసూళ్లను రాబట్టిన నాయికగా ఆమె పేరు మారుమ్రోగింది.
దాదాపు 180 సినిమాల వరకూ చేసిన విజయశాంతి, రాజకీయాలలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి సినిమాలు తగ్గిస్తూ వచ్చారు. ఆ తరువాత రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తూ, సినిమాలను పక్కన పెట్టేశారు. చాలా గ్యాప్ తరువాత ఆమె ఈ మధ్య వచ్చిన ‘సరిలేరు నీ కెవ్వరు‘ సినిమా చేశారు. ఆ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ సినిమా సూపర్ హిట్టైనప్పటికీ.. తాను ఇక సినిమాల్లో నటించనని ఆ మధ్య చెప్పింది ఆమె. అయితే ఆ మాటను వెనక్కు తీసుకొని ఇప్పుడు విజయశాంతి దేశభక్తి నేపథ్యంలో మరో సినిమా చేస్తుండటం, ఆమె అభిమానులకు శుభవార్తే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Must Read ;- షాక్ ఇచ్చిన లేడీ అమితాబ్











