మొన్న ఇద్దరు మంత్రులు, నిన్న ఎమ్మెల్యే, నేడు మరో మంత్రికి ప్రజల నిరసన సెగ తగిలింది. ఏపీలో జగన్ పాలనా విధానాలపై, తమకు జరుగుతున్న అన్యాయాలపై వివిధ వర్గాల ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. దీంతో తమ ప్రాంతాలకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పర్యటించటానికి వైసీపీ ప్రజా ప్రతినిధులు జంకుతున్నారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్ అడ్డగింత
అనంతపురంలో ఈ రోజు నిరుద్యోగులు మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. కొత్త జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నిరసనలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్ యూఐ తదితర విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసన వ్యక్తం వస్తున్నా ప్రభుత్వం స్పందంచక పోవడం దారుణమని పేర్కొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.
నేరడి బ్యారేజ్ దగ్గర మంత్రులకు చేదు అనుభవం
శ్రీకాకుళం జిల్లాలోని నేరడి బ్యారేజ్ సందర్శనకు వచ్చిన ఇద్దరు మంత్రులకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి అనిల్ కాన్వాయ్ను చిన్నదిమిలి, కాట్రగడ గ్రామస్తులు అడ్డుకున్నారు. క్వారీలో అక్రమ బ్లాస్టింగ్లను ఆపాలని ఆయా గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని మంత్రుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని మంత్రులు అనిల్, కృష్ణదాస్లు హామీ ఇవ్వడంతో ఆయా గ్రామస్థులు శాంతించి మంత్రి అనిల్ వాహనానికి దారి ఇచ్చారు.
పోలీసు జీపులో దాక్కున్న బొబ్బిలి ఎమ్మెల్యే
రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా కొండకెంగువ గ్రామస్థులు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడుకు పట్ట పగలే చుక్కలు చూపించారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అనర్హులకు ప్రాధాన్యం ఇచ్చారని గ్రామస్తులు గొడవకు దిగి పలు సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ నాయకులకే పట్టాలిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ గ్రామస్తులంతా ఆయనను చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, భారీ భద్రత మధ్య ఎమ్మెల్యేను శంకుస్థాపన చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయకుండా ఎలా శంకుస్థాపన చేస్తారంటూ అక్కడ మహిళలు, యువకులు ఎమ్మెల్యేకు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో గ్రామస్తులంతా టెంట్లు, కుర్చీలను ధ్వంసం చేసి రాళ్లతో ప్రతిదాడికి దిగారు. ఈ ఘటనలో ఒక పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్థుల నిరసనలతో బెంబేలెత్తిన చినప్పలనాయుడు పరుగెత్తిన తీరు, జనం నుంచి తప్పించుకునేందుకు చేసిన యత్నాలు, చివరకు రెండు గంటల పాటు ఆయన పోలీసు జీపులో దాక్కున్న వైనం వైసీపీ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Must Read ;- రాంకీలో ఐటీ రైడ్స్.. వైసీపీ ఎంపీ బుక్కయ్యారా?