కూతురు వైఎస్ షర్మిల పార్టీ బలోపేతం కోసం వైఎస్ విజయమ్మ తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పెద్దగా స్పందనే రాలేదు. వైఎస్సార్తో అత్యంత సన్నిహితంగా మెలగిన వారిలో చాలా మంది ఈ సమావేశానికి వస్తారని ఆశించినా.. వారిలో హాజరైన వారి సంఖ్య వేళ్లపై లెక్కించేదిగానే ఉంది. కేవీపీతో పాటు భేటీకి తప్పనిసరిగా హాజరవుతారని భావించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరైనా ఏదో మొక్కుబడిగా వచ్చినట్టే కనిపించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరైనా.. రాజకీయంగా పెద్దగా అవకాశం ఇవ్వనట్టే కనిపించారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి మాత్రం ఈ భేటీకి హాజరయ్యారు. అదే పార్టీకి చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి, ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన వి.దినేశ్ రెడ్డి కూడా ఈ భేటీలో కనిపించారు. ఇక టీపీసీసీ చీఫ్ పదవి కోసం తనదైన శైలి యత్నాలు చేసి.. తన ప్రత్యర్థి రేవంత్ రెడ్డికి ఆ పదవి దక్కడంతో తీవ్ర ఆగ్రహంలో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ భేటీకి హాజరై.. అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు.
ఈ ఇద్దరు ఎందుకొచ్చారో?
బీజేపీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఏపీ జితేందర్ రెడ్డి.. ఆ పార్టీ టికెట్ పై ఓ పర్యాయం, మరోమారు టీఆర్ఎస్ టికెట్ పై మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిచిన ఏపీ జితేందర్ రెడ్డి.. ఇప్పుడు రాజకీయంగా అంతగా యాక్టివ్ గా లేరు. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిపోయిన ఆయన ఆ తర్వాత సొంత గూటికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు పార్టీలో ఆయనను పట్టించుకుంటున్న వారు దాదాపుగా లేరనే చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ వేదికను చూసుకునే దిశలోనే ఆయన షర్మిల పార్టీకి దగ్గరవుతున్నారని, అందులో భాగంగానే ఆయన విజయమ్మ ఆత్మీయ సమావేశానికి వచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా వ్యవహరించి.. ఐపీఎస్ గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దినేశ్ రెడ్డి తొలుత వైసీపీలో చేరిపోయారు. మల్కాజిగిరి ఎంపీ సీటు నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ తన పార్టీని ఏపీకే పరిమితం చేయగా.. చేసేది లేక దినేశ్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. విజయమ్మ భేటీకి రావడం ద్వారా మరోమారు తన రాజకీయ భవిష్యత్తును ఆయన పరీక్షించుకోనున్నారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
కోమటిరెడ్డిది ధిక్కారమేనా?
ఇక విజయమ్మ ఆత్మీయ సమావేశానికి తప్పనిసరిగా వస్తారని భావించిన నేతల జాబితాలో కోమటిరెడ్డి బ్రదర్స్ పేర్లు కూడా తొలి వరుసలోనే వినిపించాయి. వైఎస్సార్ తో అత్యంత సన్నిహితంగా మెలగిన కోమటిరెడ్డి సోదరులు.. వైఎస్సార్ కారణంగానే రాజకీయంగా ఎదిగారు. అయితే విజయమ్మ సమావేశానికి ఎవరూ వెళ్లరాదంటూ టీపీసీసీ ఆంక్షలు విధించినా గానీ వాటిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. విజయమ్మ పిలుపునకు సానుకూలంగా స్పందించిన కోమటిరెడ్డి గురువారం నాటి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఆంక్షలను గుర్తు చేయగా.. తానేమీ తప్పు చేయలేదని ఆయన సమర్ధించుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా సత్తా చాటిన నేతకు నివాళి అర్పించేందుకే వెళ్లానని, అయినా తనకు టీపీసీసీ జారీ చేసిన నోటీసుల గురించి తెలియదని కూడా చెప్పుకొచ్చారు. అయినా తనపై చర్యలు తీసుకోవాలనుకుంటే.. తాను అధిష్ఠానానికే సమాధానం చెబుతానంటూ ఒకింత ధిక్కార స్వరాన్నే వినిపించారు. మొత్తంగా విజయమ్మ ఆత్మీయ సమావేశం అట్టర్ ప్లాఫ్ కాగా.. కోమటిరెడ్డి మొత్తం షోను తనవైపునకు తిప్పుకున్నారు.
Must Read ;- ఈ ముగ్గురూ మళ్లీ కాంగ్రెస్లో కనిపిస్తారా?