తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తన అభ్యర్థిని ప్రకటించేసింది. ఈ దిశగా అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించిన పార్టీగా కూడా టీఆర్ఎస్ దూకుడు చూపించింది. గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే ఈ విషయాన్ని పార్టీ ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది నేతల పేర్లను పరిశీలించిన కేసీఆర్.. హుజూరాబాద్ లో బీసీ అభ్యర్థినే బరిలోకి దించే దిశగా సాగారు. ఈ క్రమంలోనే యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక
ఆది నుంచి టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధిష్ఠానంతో విభేదాల కారణంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ నకు గురయ్యారు. దీనిని అవమానంగా భావించిన ఈటల.. టీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో పాటుగా ఆ పార్టీ నుంచి దక్కిన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు గానీ.. తాను టీఆర్ఎస్ బలంతో గెలవలేదని నిరూపించుకునే దిశగా బీజేపీలో చేరిన ఈటల.. అప్పుడే ప్రచారం ప్రారంభించారు. అందుకు భిన్నంగా ఈటలకు సొంత ఇమేజీ ఏమీ లేదని, టీఆర్ఎస్ చలవ వల్లే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారని నిరూపించాలన్న కసితో సాగుతున్న కేసీఆర్.. ఈటలను ఓడించే సత్తా కలిగిన నేత పేర్లను పరిశీలిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన గెల్లు శ్రీనివాస్ ను ఎంపిక చేశారు.
గెల్లు నేపథ్యం ఇదే
బీసీ జాబితాలో కీలక సామాజిక వర్గమైన యాదవ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్ లోకల్ అయిన గెల్లు.. లోకల్ తో పాటు బీసీ ఓట్లను రాబట్టగలరన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మెరుగ్గానే రాణిస్తున్న గెల్లు.. అధిష్ఠానం దృష్టిలోనూ మంచి మార్కులే వేయించుకున్నారని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటే నడిచిన గెల్లు.. పార్టీకి నమ్మిన బంటేనని చెప్పాలి. అంతేకాకుండా గతంలో ఈటల టీఆర్ఎస్ లో ఉన్నంత కాలం ఆయనతోనూ గెల్లు సఖ్యతగానే మెలగారు. మొత్తంగా పార్టీలో సొంత వర్గమంటూ లేకపోయినా.. వ్యతిరేక వర్గం అంటూ లేకుండా గెల్లు సాగుతున్నారు. ఈ అంశమే ఆయనకు కలిసి వచ్చిందని చెప్పాలి.
Must Read ;- హుజూరాబాద్ ఉప ఎన్నికకు వేళాయే!