‘బిగ్ బాస్ 3’ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ – పునర్నవి చనువుగా ఉండటం .. సరదాగా మాట్లాడుకోవడం .. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ ఎమోషనల్ కావడం జరిగింది. దాంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమవ్యవహారం కొనసాగుతోందని అంతా అనుకున్నారు. ‘బిగ్ బాస్ 3’ హౌస్ నుంచి బయటికి వచ్చేసిన తరువాత కూడా ఈ ఇద్దరూ అక్కడక్కడా కలిసి కనిపించారు. దాంతో వాళ్ల ప్రేమకి సంబంధించిన ప్రచారం కొనసాగుతూనే వచ్చింది. ఆ తరువాత పునర్నవి స్థానంలో ‘అశు రెడ్డి’ పేరు తెరపైకి వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ కి ఈ విషయానికి సంబంధించిన ప్రశ్నే ఎదురైంది.
అందుకు రాహుల్ స్పందిస్తూ .. పునర్నవి అయినా అశు రెడ్డి అయినా ‘బిగ్ బాస్ 3’ హౌస్ కి వచ్చిన తరువాతనే నాకు పరిచయమయ్యారు. అంతకుముందు వాళ్లతో నాకు ఎలాంటి పరిచయం లేదు. “అశు నాకు మంచి స్నేహితురాలు .. అంతకుమించి మా మధ్య ఎలాంటి అనుబంధం లేదు. అశు చాలా మంచి అమ్మాయి .. ఎదుటి వ్యక్తిని ఎలా చూసుకోవాలనేది ఆమెకి బాగా తెలుసు. ఆమె నా జాన్ జిగ్రీ అని మాత్రమే చెప్పగలను. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇక పునర్నవితో కూడా నాకు వున్నది స్నేహం మాత్రమే. ఈ ఇద్దరిలో నేను ఎవరినీ ప్రేమించడం లేదు.
ఇటు పునర్నవికి సంబంధించిగానీ .. అటు అశు రెడ్డికి సంబంధించిగాని నా విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని మా ఇంట్లో వాళ్లు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే నేను ఏమిటనేది వాళ్లకి బాగా తెలుసు. పునర్నవి .. అశు రెడ్డిలతో నేను ఎలా నడచుకుంటానో వాళ్లకి తెలుసు. మేము మసలుకునే విధానాన్ని బట్టే, మా మధ్య వున్నది కేవలం స్నేహం మాత్రమేననే విషయం వాళ్లకి అర్థమైపోతుంది. ప్రస్తుతం నేను నా కెరియర్ పైనే పూర్తి దృష్టి పెట్టాను. కొత్తగా ఒక ఆల్బమ్ చేశాను. దాని కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయడం జరిగింది. ఈ ఆల్బమ్ నన్ను మరోమెట్టుపైకి చేరుస్తుందనే నేను భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- ప్రేమలో పడిన బాలీవుడ్ స్టార్ డాటర్.. !