(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట బుధవారం బీజేపి ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్త అబ్దుల్ ఆదిల్ పెట్రోల్ పోసికొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే భారీ ఎత్తున మోహరించిన పోలీసులు అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వెనువెంటనే పోలీసు స్టేషనుకు తరలించారు. అంతకు ముందు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని మాట్లాడుతూ రామతీర్థంలోని కోదండరాముని ఆలయ సందర్శనకు వైసీపీకి, తెలుగుదేశం పార్టీలకు అనుమతించిన ప్రభుత్వం బీజేపీకి అవకాశం కల్పించకపోవడం గర్హనీయమన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడం, అరెస్టులు చేయడం శోచనీయమన్నారు. బీజేపి ఎదుగుదల తట్టుకోలేక ప్రభుత్వం ఇటువంటి కుట్రలు పన్నుతోందన్నారు. కోదండరాముని శిరస్సు ఖండించడానికి బాధ్యత వహించి వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై సీబీఐచే దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Must Read ;- సూరిబాబు.. రాములోరికి బలిపశువు ఎలా అయ్యాడంటే..