విజయనగరం అనే పేరు వినగనే..రాజసత్వం గుర్తుకు వస్తుంది. గజపతి వంశ ప్రతిష్టతకు చిహ్నంగా స్మృతికి వస్తుంది.. ఇక ఆ రాజవంశీకుడు అశోక్ గజపతి రాజుకు పదవి.. ఆయనకు ఇచ్చే గౌరవంగానే భావించాల్సి ఉంటుంది. ఆ పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించాల్సిన అవసరం ఆయనకు లేదు.. ఆయన వక్తిత్వం అది కానే కాదు..ఈ విషయాన్ని అన్ని పార్టీలవారు చెబుతారు. అందుకే ఆయన పార్టీలు మారే వ్యక్తి కాదు.. క్షుద్ర రాజకీయాలు చేయరు. నొచ్చుకుంటే పక్కకి వెళ్లే వ్యక్తిత్వం. అప్పట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిన అంశాలు నచ్చకే..కేంద్ర పౌరవిమానయాన మంత్రి పదవిని కూడా వదులుకున్నారని అప్పట్లోనే చర్చ జరిగింది. అంటే తనకు ఇష్టం లేకపోతే.. పదవులను వదులుకునే వ్యక్తిత్వమని ఆయన వ్యవహారశైలిని గమనిస్తున్నవారికి కూడా అర్థం అవుతుంది. అదే అవకాశంగా వైసీపీ పావులు కదుపుతోంది. అవినీతి పరంగానో, అధికార పరంగానో అశోక్ గజపతి రాజుని టచ్ చేయలేరు.. ఉన్న ఏకైక మార్గంతో కుటుంబంలో ఉన్న కొన్ని గ్యాప్లకు ఆజ్యం పోసి..ఆ రాజవంశ కుటుంబ గౌరవాన్ని రచ్చకు ఈడ్చి..అశోక్ గజపతి రాజుని ఏకాకిగా చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని తీసురావడం, అశోక్ గజపతి రాజు పదవులను తొలగించి ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతోందనే విమర్శలున్నాయి.
ధర్మకర్మ పదవుల నుంచి తొలగింపు
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, సింహాచలం బోర్డు ఛైర్మన్, ఎంఆర్ కాలేజీ, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రూ.2లక్షల్లోపు ఆదాయం ఉన్న 104 ఆలయాల ధర్మకర్మ పదవి నుంచి తప్పించడం అదే కుటుంబానికి చెందిన సంచైతకు అప్పగించడం ఇందులో భాగంగానే కనిపిస్తోంది. తాజాగా పైడితల్లి, రామతీర్థం, మందపల్లిల ధర్మకర్త పదవులను కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
అప్పటి వరకు ఆమె పేరు చాలామందికి తెలియదు..
వాస్తవానికి విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్(MANSAS TRUST) ఛైర్పర్సన్గా సంచైత గజపతి బాధ్యతలు తీసుకునే వరకూ ఆమె పేరు ఆ జిల్లాలో చాలా మందికి తెలియదు. అయితే ఏపీ సర్కార్ తీసుకొచ్చిన జీవోలతో ఆమె పేరు తెరపైకి వచ్చింది. గత ఏడాది మార్చి 4న జారీచేసిన ఈ జీఓ ఇందుకు కారణం. అశోక్ గజపతి రాజు స్థానంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ బాధ్యతలను ఆమెకు అప్పగిస్తూ ఆ జీఓ విడుదలైంది. కాగా సంచైత వారసత్వ వివాదం న్యాయస్థానంలో పరిధిలో ఉంది. మరోవైపు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన చెప్పిన అంశం ప్రకారం.. ‘ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతి. వీరికి ఇద్దరు సంతానం. వారిలో చిన్న కుమార్తె సంచైత గజపతిరాజు. సంచైత చిన్న తనంలో ఆనంద గజపతిరాజు..ఉమా గజపతి విడాకులు తీసుకున్నారు. అనంతరం ఉమా గజపతి బాలీవుడ్ డైరక్టర్ రమేష్ శర్మను ఉమ వివాహం చేసుకున్నారు. చానాళ్లపాటు ఉమా గజపతి విజయనగరం రాలేదు. విద్యాభాస్యం అనంతరం సంచైత బీజేపీలో చేరారు. సనా అనే స్వచ్ఛంద సంస్ధ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తన సర్టిఫికెట్లలోనూ తండ్రి రమేష్ శర్మ అని పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. సంచైత తెరపైకి వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా మాన్సాస్ ట్రస్ ఛైర్మన్ అయ్యారు. దీంతో వివాదం తలెత్తింది. అప్పటి నుంచి ఆరోపణలు ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నాయి.
గౌరవానికి గుర్తుగానే అశోక్కు పదవులు
పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలు, జిల్లాలో తన పట్టు నిలుపుకునే అంశాలు మినహా అశోక్ గజపతి రాజు ఇతర విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. టీడీపీ హయాంలో..రాచరికపు విరోధాన్ని పక్కన బెట్టి మరీ సుజయ కృష్ణ రంగారావుతోనూ కలిశారు అశోక్ గజపతి రాజు. విశాఖ, విజయనగరంలో ఆయన కుటుంబీకులు ప్రభుత్వాలకు, ప్రజలకు ఇచ్చిన ఆస్తులే రూ.వేల కోట్లు ఉంటాయని అంచనా. అలాంటిది ఆయనకు ఉన్న పదవులు గౌరవానికి గుర్తుగానే తప్ప.. వేరే ఉద్దేశం లేదని అక్కడి ప్రజల మాట.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న రాజకీయపరిణమాలను పరిశీలిస్తే.. టార్గెట్ టీడీపీగా కనిపిస్తోంది. అందులో భాగంగా టీడీపీలో ఉన్నవారిని అన్ని మార్గాల్లో వేధించడం కూడా జరుగుతోందనే విమర్శలున్నాయి. ఈ రాజకుటుంబం విషయంలోనూ అదే జరుగుతోందనే ప్రచారం ఉంది. అంతేకాదు..విజయనగరంలో చారిత్రక సాక్ష్యాల్లో ఒకటైన మూడు లాంతర్ల స్తంభం తొలగించడం, సిరిమాను పైడితల్లి అమ్మవారి ఉత్సవ నిర్వహణ విషయంలో సంచైత వ్యవహరించిన తీరు, సింహాచలం బోర్డు ఛైర్మన్గా అశోక్ గజపతి రాజు తొలగింపు, ఆలయాల ఛైర్మన పదవుల నుంచి తొలగింపు..ఇదంతా ఆయన అస్తిత్వంపై దెబ్బకొట్టే వ్యూహంగానే కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది.
వ్యక్తిగత దూషణలూ..
రాజకీయంగా ఏ పార్టీవారు కూడా అశోక్ గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సాధారణంగా జరగదు. వైఎస్ హయాంలోనూ ఇలాంటివి చోటు చేసుకోలేదు. అప్పట్లో ఆ పార్టీకి చెందినవారు కొందరు కొన్ని విమర్శలు చేసినా..వైఎస్ స్వయంగా వారిని వారించారని, దీంతో వారు వ్యక్తిగత విమర్శలు తగ్గించారని ప్రచారం జరిగింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అశోక్ గజపతి రాజుపై వ్యక్తిగత దూషణల పర్వానికి తెర లేచింది. రామతీర్థం ఆలయం ఇష్యూలో.. ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి మాట్లాడతూ.. అశోక్ గజపతి రాజుని వ్యక్తిగతంగా గతంలో ఎన్నడూ వినని పదజాలాన్ని వాడారు. పార్టీ పరంగా సంకేతాలు రానిదే ఆయన ఈ పదజాలాన్ని వాడారనే అనుకోవడానికి వీల్లేదని, ఎలాగైనా ఆ కుటుంబాన్ని టీడీపీకి దూరం చేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందనే చర్చ మొదలైంది.
Also Read: అశోక్ గజపతికి అవమానం : పైడితల్లి పూజకు దూరం!