ఎస్ఈసీ తీరును నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలోనే 22 శాతం బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత నోటిఫికేషన్ కొనసాగించడం వల్లే టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తోందని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు. జగన్ ఏది చెబితే అధికారులు ఆలోచన లేకుండా అది చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో ప్రజాస్వామ్యం లేదా?
ఏపీలో అసలు ప్రజాస్వామ్యమే లేదని, వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, కిడ్నాప్లు చేయడంతోపాటు అనేక ఇబ్బందులకు గురి చేసినా మంచి ఫలితాలు సాధించామన్నారు. అయితే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ ప్రకటన చేయకముందే తేదీలను మంత్రులు ఎలా ప్రకటిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక్క విడతలో, వారం రోజుల్లో ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన దుయ్యబట్టారు. ఎస్ఈసీ తీరుకు నిరసనగా ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
Also Read:‘పింగళి’కి భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు