తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు పునాది పడింది. ఈ కేంద్ర ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ ఇంటిలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. దేశంలో పెట్టుబడులు పెట్టే బహుళ జాతి సంస్థలకు వివాదం లేని వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తాను తలచానని, తాను అనుకున్న 3 నెలల్లోనే ఈ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఈ సందర్భంగా జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ కేంద్రం ఏర్పాటు, త్వరితగతిన ఈ కేంద్ర కార్యకలాపాలు ప్రారంభించేలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకోవాలని కూడా జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. మొత్తంగా జస్టిస్ ఎన్వీ రమణ అనుకున్న 3 నెలల్లోనే ఈ కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటయ్యే దిశగా శరవేగంగా చర్యలు ప్రారంభమవడం.. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు మేలు జరుగుతుందన్న భావన నెలకొంది.
ఈ కేంద్రం పనేమిటి?
ఏదేనీ పారిశ్రామిక సంస్థ మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు వస్తే.. అటు కేంద్రమైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా కేవలం పెట్టుబడులను ఆకర్షించడానికే ఆయా ప్రభుత్వాలు భారీ ప్రోత్సాహకాలతో కూడిన పారిశ్రామిక విధానాలను ప్రకటిస్తున్నాయి. ఈ పాలసీలను పట్టుకుని బహుళ జాతి సంస్థల వద్దకు వెళుతున్న ప్రభుత్వ ప్రతినిధులు.. తమ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నాయి. చాలా భేటీల్లో సానుకూల ఫలితాలే వస్తున్నాయి. అయితే పెట్టుబడులు పెట్టేదాకా అంతా బాగానే జరిగినా.. ఆ తర్వాతే అసలు సమస్యలు ఎదురవుతున్నాయి. బహుళ జాతి సంస్థలు నిబంధనలను పాటించకపోవడమో.. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించకపోవడమో జరిగితే.. రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంటుంది. ఈ వివాదాలను పరిష్కరించేందుకు ఇప్పటిదాకా ఓ వ్యవస్థ లేదనే చెప్పాలి. ఈ తరహా వివాదాల పరిష్కారం లక్ష్యంగానే ఇప్పుడు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామిక ఒప్పందాల ఉల్లంఘనలు.. ప్రభుత్వాలు, పరిశ్రమల (ప్రత్యేకించి విదేశాలకు చెందిన కంపెనీలు) మధ్య తలెత్తే వివాదాలను ఈ కేంద్రం పరిష్కరించనుందన్న మాట.
జగన్ అండ్ కోకే ముప్పు ఎలా?
జగన్ అక్రమాస్తుల కేసులో పలు విదేశాలకు చెందిన కంపెనీల పాత్ర కూడా ఉంది కదా. నాలుగు రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో దాఖలు చేసిన వాన్ పిక్ చార్జిషీటులో అరబ్ దేశాలకు చెందిన రస్ ఆల్ ఖైమా కంపెనీ ఉంది కదా. ఈ కంపెనీ జగన్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. జమైకా పర్యటనకు వెళ్లిన నిమ్మగడ్డను అక్కడి పోలీసులతో అరెస్ట్ చేయించింది కూడా. అయితే అక్కడి కేసులతో నిమ్మగడ్డ కొన్ని రోజుల పాటు జైల్లో ఉంటే ఉండవచ్చు గానీ.. పెద్దగా ఇబ్బందేమీ లేదనే చెప్పాలి. అలా కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభమైతే.. వైఎస్సార్ సర్కారుతో పాటు నిమ్మగడ్డ తనను ఎలా మోసగించారన్న విషయాన్ని రస్ ఆల్ ఖైమా ఈ కేంద్రంలోనే ఫిర్యాదు చేయవచ్చు. తనను మోసగించిన వారిని ఈ కేంద్రానికి పిలిపించి.. తాను నష్టపోయిన సొమ్మును ఆ కంపెనీ రాబట్టుకోవచ్చు. మొన్నటికి మొన్న చంద్రబాబు హయాంలో విశాఖలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన లులూ గ్రూపు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కెళ్లిపోయింది. ఈ క్రమంలో తనకు జరిగిన నష్టం ఏ కారణంతో జరిగింది? తాను ఎందుకు వెనక్కెళ్లిపోతున్నాను? తనకు పరిహారం ఇప్పించండి.. అంటూ లులూ గ్రూపు కూడా ఈ కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. అంటే.. జగన్ అండ్ కోకు ఈ కేంద్రంతో చాలా ముప్పే ఉందన్న మాట.
Must Read ;- జగన్ కోర్టు మెట్లెక్కాల్సిందేనా?