విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏపీ కాంగ్రెస్ ఢిల్లీలోని ఏపీ భవన్ ఎదుట నిరసనకు దిగింది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ నిరసన కార్యక్రమాన్ని ముందుండి నిడిపిస్తున్నారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వ చేతిగాని తనం వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం అమ్మానికి పెట్టిందని శైలజానాథ్ ద్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా మెతక వైఖరి విడనాడాలని, కేంద్రంతో పోరాడితే విశాఖ ఉక్కు ఎక్కడికీ పోదని ఆయన అన్నారు. ఏపీ వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లడం వల్లే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానన్న జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ప్రధాని వద్ద మోకరిల్లాడని శైలజనాథ్ విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆపేశారని, ఇక పోలవరం నిధుల విడుదల విషయంలోనూ ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన దుయ్యబట్టారు.
లాభాలొచ్చే పరిశ్రమలన్నీ ప్రైవేటుకు..
దేశంలో లాభాలొచ్చే పరిశ్రమలన్నీ ప్రైవేటుకు, నష్టాలొచ్చే వాటిని జాతీయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల రాజు ఎద్దేవా చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక… దేశంలో ఇప్పటికే 200 పరిశ్రమలను అమ్మివేశారని త్వరలో బీఎస్ఎన్ఎల్, ఎఐసీలను కూడా అమ్మి వేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పరిశ్రమలను ఏడేళ్లలోనే బీజేపీ నేతలు అమ్మివేశారని కొప్పుల రాజు విమర్శించారు. విశాఖ ఉక్కును తక్కువ ధరకే అయిన వారికి కట్టబెట్టేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని ఆయన గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకునే వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కొప్పుల రాజు హెచ్చరించారు.
Must Read ;- విశాఖ ఉక్కు పరిరక్షణకు కాంగ్రెస్ జాతీయ స్థాయి ఉద్యమం











