‘కాలు జారితే తీసుకోవచ్చేమోగాని నోరు జారితే తీసుకోలేం’ అనే సామెత మనకు ఉండనే ఉంది. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. ఏం మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడాల్సిందే. సినిమాల్లో డైలాగులు రాయాలన్నా ఒళ్లు దగ్గరుంచుకుని రచయితలు డైలాగులు రాస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎవరి మనోభావాలనూ కించపర్చకుండా సమాజంలో నెట్టుకు రావడం కూడా కష్టమే. మొన్న హైపర్ ఆది నోరు జారి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు పరిస్థితి కూడా అంతే.
ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాదాలు ఎక్కువయ్యాయి. కొంతమంది కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు. దీనివల్ల ఫ్రీ పబ్లిసిటీ కూడా రావడంతో ఇది వేలం వెర్రిలా మారింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే షోలో హైపర్ ఆది తెలంగాణ యాస, భాష సంస్కృతిని అవమానపరిచాడనేది ఆరోపణ. బతుకమ్మ, గౌరమ్మలను కించపరుస్తూ మాట్లాడాడని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ స్కిట్పై తెలంగాణ ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచాయి. ఈ నేపథ్యంలో ఆది క్షమాపణలు చెప్పక తప్పలేదు.
అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, అయినా తన తరపున, ఆ స్కిట్ సందర్భంగా స్టేజీపై ఉన్న అందరి తరఫునా క్షమాపణ చెబుతున్నానని ఆది పేర్కొన్నారు. ఇక ప్రదీప్ విషయానికి వస్తే తెలుగు బుల్లితెరపై మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ ఏపీ రాజధానిపై చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ నోరు జారడం, దాంతో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను అమరావతి రైతులతో పాటు ఏపీ పరిరక్షణ సమితి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది.
క్షమాపణ చెప్పకపోతే ప్రదీప్ ఇంటికి ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు హెచ్చరించడంతో పాటు అలాంటి ప్రయత్నాలుచేయడంతో ప్రదీప్ కూడా దిగిరాక తప్పలేదు. తాను ఎవరినీ కించపరచడానికి కానీ, అవమానించడానికి కానీ ప్రయత్నించలేదని పేర్కొంటూ ప్రదీప్ వీడియో బైట్ విడుదల చేశారు. అసలు అది తన ఉద్దేశం అది కాదన్నారు. అనుకోకుండా అలాంటి తప్పు దొర్లిందని స్పష్టం చేశాడు. తన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం పంచడమే తప్ప ప్రజల మనోభావాలు దెబ్బ తీయడం కాదని క్షమాపణలు చెప్పాడు.
ఇలాంటి వివాదాలు జరగడం, క్షమాపణలు చెప్పడం సర్వసాధారణంగా మారిపోయింది. ఓ క్షమాపణ చెప్పేస్తే సరిపోతుందన్న ఉద్ధేశంతో కొందరు కావాలనే ఇలాంటి వివాదాల్లోకి దూరే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా ఉన్న తరుణంలో మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
Must Read ;- కరోనా సాయంపై ‘సినీ’ రాద్దాంతాలేలనో?











