కరోనా సెకండ్ వేవ్ కోరల్లో చలనచిత్ర పరిశ్రమ విలవిల్లాడుతోంది. చాలా సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. తమిళ హాస్య నటుడు వివేక్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత గుండె పోటు రావడం, చివరికి ఆయన మరణించడంతో సినిమా పరిశ్రమలో భయాందోళనలు నెలకొన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ కో డైరెక్టర్ సత్యం శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకుల దగ్గర ఆయన కో డైరెక్టర్ గా పనిచేశారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమేక్ కు కూడా ఆయన కోడైరెక్టర్ గా పనిచేస్తున్నారు. దర్శకుడు రాంప్రసాద్ కూడా కరోనాతో ఆస్పత్రి పాలైనట్టు సమాచారం ఉంది. అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్ర యూనిట్ లో చాలా మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సమాచారం. హీరో రానా కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇలా చాలా మంది కోవిడ్ బారిన పడటంతో అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి.
సినీ కార్మికులందరికీ సీసీసీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ డైవ్ ఏర్పాటుచేసినా కొన్ని కారణాంతరాల వాయిదా వేశారు. షూటింగులు లేకపోతే మళ్లీ ఉపాధి కోల్పోతామేమోనన్న భయాందోళనలో కార్మికులున్నారు. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, వి.ఎన్. ఆదిత్యలకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు సమాచారం. రానున్న రెండు మూడు రోజుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. సినిమా విడుదలలు కూడా వాయిదా పడుతున్నాయి.
Must Read ;- ‘పబ్లిక్’గా పాజిటివ్ టాక్.. క్యా కరోనా?