రామభక్తులను రామ మందిరం పేరుతో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు మోసగించిందని ఉత్తరప్రదేశ్లోని విపక్ష పార్టీలు ఆదివారం ఆరోపించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత పవన్ పాండేలు భూముల కొనుగోలులో ట్రస్టుపై అవినీతి ఆరోపణలు చేశారు.
అయోధ్యలో రూ.2 కోట్లు విలువ చేసే భూములను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసినట్టు సంజయ్ సింగ్ ఆరోపించారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూముల విలువ రూ.2 కోట్లుగా అంచనా వేశారని, ఆ తర్వాత ఐదు నిమిషాలకు రూ.16.5 కోట్లు అదనంగా అమ్మకందారుకి ఇచ్చారని ఆయన తెలిపారు. రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంపత్ రాయ్ ఆదేశాలతోనే ఈ రెండు చెల్లింపులు జరిగాయని కూడా ఆప్ నేత ఆరోపించారు. రిజిస్ట్రీ సాక్ష్యులుగా ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా, అయోధ్య మేయర్ రిషీకేష్ ఉపాధ్యాయ ఉన్నారన్నారు. దీనిపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో విచారణ జరిపిచాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
కేవలం 10 నిమిషాల తేడాలోనే భూమి విలువను 10 రెట్లు ఎలా పెంచారని సమాజ్వాదీ పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పవన్ పాండే ప్రశ్నించారు. భూమి విలువ రూ.2 కోట్లుగా 2021 మార్చి 18న రామ టెంపుల్ పేరుతో భూమి కొనుగోలు రిజిస్ట్రీ చూపిస్తోంది. కానీ, పది నిమిషాల తర్వాత రామాలయ ట్రస్టుకు, అమ్మకం దారుకు మధ్య రూ.18.5 కోట్లకు అగ్రిమెంట్ జరిగిందని పవన్ పాండే తెలిపారు. రామమందిరం పేరుతో రామభక్తులను ట్రస్టు మోసగించిందని, భూముల కొనుగోలు డీల్ గురించి ఒక ట్రస్టీకి, అయోధ్య మేయర్కు తెలుసునని అన్నారు. కాగా, ఈ ఆరోపణలపై ఆలయం ట్రస్టు ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Must Read ;- టీటీడీ చెప్పిన దాంట్లో ప్రామాణికత లేదు : గోవిందానంద సరస్వతి