ప్రపంచ దేశాలను వణికిస్తున్నకరోనా వైరస్ సహజ సిద్ధంగా వచ్చిందా లేక చైనా సృష్టించిందా అనే అనుమానాలున్న సమయంలో తాజాగా మరో పత్రిక ఈ వైరస్ను చైనాలోనే సృష్టించినట్లు సంచలన కథనం ప్రచురించింది.ఈ వైరస్ను చైనా సృష్టించడమే కాకుండా గబ్బిలాల నుంచి వచ్చినట్టు చెప్పేందుకు రివర్స్ ఇంజినీరింగ్కు ప్రయత్నించిందని లండన్ కేంద్రంగా ప్రచురితమయ్యే ‘డెయిలీ మెయిల్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.ఈ కథనంలో పలు అంశాలపై సందేహాలను,నిపుణుల అభిప్రాయాలను పొందుపర్చింది.ఇప్పటికే చైనాలోని వుహాన్లోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీకైందన్న అనుమనాలపై ఇటీవల వాషింగ్టన్ పోస్ట్తో పాటు పలు పత్రికలు పరిశోధనాత్మక కథనాలు ప్రచురించాయి.ఈ ల్యాబ్లో పని చేస్తున్న ముగ్గురు పరిశోధకులు అస్వస్థతకు గురైన అంశాన్ని కూడా ప్రచురించాయి. ఈ నేపథ్యంలో మరోసారి వుహాన్ ల్యాబ్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ మరికొన్ని పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. సార్స్-కోవ్-2 (కొవిడ్ -19) వైరస్ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటిష్ పరిశోధకులు అంగూస్ డాల్గ్లిష్, నార్వే శాస్త్రవేత్త బిర్గర్ సొరెన్సెన్ తమ పరిశోధనను వెలువరించారు.పూర్తి నివేదిక ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
తయారు చేసింది ఇలా..
కాగా వారి పరిశోధనల ప్రకారం డెయిలీ మెయిల్ ప్రచురించిన కథనంలో వైరస్ను ఎలా సృష్టించారనే అంశాన్ని ప్రచురించారు.సాధారణంగా గబ్బిలాల నుంచి వచ్చే వైరస్లు మనుషులపై ఎక్కువగా ప్రభావం చూపే పరిస్థితుల నేపథ్యంలో చైనాలోని గుహల్లో ఉండే సహజసిద్ధ కరోనా వైరస్ సోకి గబ్బిలాల వెన్నెముకను సేకరించి దానికి కొత్త స్పైక్ చొప్పించారని,తద్వారా ఈ వైరస్ ప్రమాదకరంగా,తీవ్రంగా వ్యాపించేలా మార్చారన్నారు.ఇది కచ్చితంగా ల్యాబ్లోనే తయారైందనేందుకు కొన్ని ప్రత్యేక సంకేతాలు కూడా గుర్తించామని సదరు పరిశోధకులు తెలిపారు.సృష్టించారనడానికి కొవిడ్-19 నమూనాల్లో తాము ‘ప్రత్యేక సంకేతాల’ను గుర్తించామని కూడా చెప్పారు.గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా వూహాన్లోని ల్యాబ్లో ఈ వైరస్ను సృష్టించారన్నారు.తరువాత డేటాను మాయం చేశారని, అయితే ఆ పరిశోధన ట్రాకింగ్ విధానం ద్వారా పలు విషయాలు బయటకు వచ్చాయన్నారు.ఈ పరిశోధనల్లో జన్యు క్రమాన్ని విశ్లేషించామని,వైరస్లోని ప్రత్యేక స్పైక్ ప్రొటీన్ వేగంగా మానవ శరీరంలోని భాగాలకు అతుక్కుంటుందని చెబుతూ సాంకేతిక వివరాలను పొందుపరిచారు.అమైనో ఆమ్లాల స్థితి గతులను వివరించారు.గతంలో తమ పరిశోధనలకు సహకరిస్తామన్న చైనాలోని కొందరు శాస్త్రవేత్తలు ముఖం చాటేశారని,మరికొందరు కనిపించకుండా పోయారని,ఇందుకు కారణాలను తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
Must Read ;- కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ లోనే సృష్టించారు: చైనీస్ శాస్త్రవేత్త
గతంలోనే అమెరికా ఆరోపణ
ఇక ఈ వైరస్ చైనాలోనే సృష్టించారని గతంలో అమెరికా ఆరోపించింది.ఇలాంటి పరిశోధనలు గతంలో జరిగినా 2014 నుంచి అమెరికా తాత్కాలిక నిషేధాన్ని విధిస్తూ వస్తోంది.అమెరికా ఇలాంటి పరిశోధనలు ఆపేసిన తరవాత చైనా ఇలాంటి పరిశోధనల కోసం 6 లక్షల డాలర్ల నిధులను కేటాయించినట్లుగా డాక్టర్ ఆంథోనీ ఫౌసీ గత వారం కాంగ్రెస్లో సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.సాధారణ అంటువ్యాధి అయితే లక్షణాలు,వ్యాప్తి,ప్రభావం వేరుగా ఉంటాయని,కొవిడ్-19 విషయంలో అలాంటివి లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.వీరే కాకుండా గతంలో చైనీస్ వైద్య నిపుణరాలు,వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేయగా చైనా ప్రభుత్వం ఆమెపై కేసులు నమోదు చేసింది.2015లో చైనా రక్షణ రంగ శాస్త్రవేత్తల,వైద్య నిపుణుల మధ్య చర్చలకు సంబంధించిన పరిశోధనా పత్రాలు బయటకు వచ్చిన విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.కాగా చైనాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథ్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి.మొత్తం మీద కొవిడ్ వైరస్ చైనాలో తయారైందేనన్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చే విధంగా పలు పరిశోధనలు బయటకు వస్తున్నాయి.
Must Read ;- కోవిడ్ ఎక్కడ పుట్టిందో నిగ్గు తేల్చండి : జో బైడెన్











