దశాబ్ధాలుగా ప్రకాశం జిల్లా నేల పేదరికాన్ని, వలస కూలీల ఆత్మఘోషను, కరవుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను, మేత కూడా దొరకక కబేళాలకు తరలివెళ్తున్న పశువులను.., వెలిగొండ ప్రాజెక్టు పేరుతో ప్రజలను మోసం చేసిన రాజకీయ పార్టీలను చూస్తూనే ఉంది. మొన్నటి వరకూ వెలిగొండ ప్రాజెక్టు పేరుతో రాజకీయ పార్టీలు ఆడుతున్న క్రీనీడలో చిక్కుకుని నష్టపోయిన జిల్లాలో.. ఇప్పుడు రామాయపట్నం పోర్టు కూడా అమరావతి రాజధానిలా భ్రమరావతి కానుందా..? అనే అనుమానాలు తెలెత్తుతున్నాయి. 2014 ఎన్నికల ముందు వరకూ రాజకీయ పార్టీలు ప్రకాశం ప్రజలకు టోపీ పెట్టడానికి వెలిగొండ పేరు చెప్పేవారు, ఇప్పుడు ఆ పేరు పక్కనే రామాయపట్నం పోర్టు అనే పేరు కొత్తగా వచ్చిచేరింది అంటే.. రాజకీయ విమర్శ కానే కాదు. సజీవం సాక్ష్యం ఇది.
2019లో బాబుకు ప్రజలిచ్చిన సమాధానం..!
2014 ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాలో ఏమో దుగరాజపట్నం పోర్టు అని, ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టగానే రామాయపట్నం పోర్టు అని బాబు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. వైసీపీకి బలమైన ప్రకాశం జిల్లాలో బాబుకు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కానీ, 2014 జూన్లో సీఎం అయిన చంద్రబాబుకి 2019 జనవరి 9 వరకు శంకుస్థాపన చేయడానికి సమయం సరిపోలేదు. దీనికి సమాధానంగా 2019లో ఒంగోలు ఎంపీ స్థానంలో ఉన్న 7 ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటి టీడీపీకి ఇచ్చి.., మిగతా 6 వైసీపీని గెలిపించి.., ఎంపీ స్థానాన్ని కూడా ఎన్నడూ లేనట్లు 2,14, 851 ఓట్లతో వైసీపీకి కట్టబెట్టి ప్రజలు గుణపాఠం చెప్పారు.
వైసీపీ ఏకంగా టోపీనే పెట్టేస్తోందా..?
బాబు ఏదో శంకుస్థాపన రాయి మాత్రమే వేస్తే.., ఇప్పుడు వైసీపీ ఏకంగా టోపీనే పెట్టబోతోంది అని ప్రకాశం జిల్లా ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డినే ప్రశ్నిస్తున్నా జిల్లా వైసీపీ నేతలంతా గప్ చుప్గా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రాథమికంగా పోర్టు కోసం 802 ఎకరాలు కావాలని, ఆ తర్వాత మరో 1,200 ఎకరాలు, మొత్తంగా పోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే నాటికి మొత్తంగా 3,420 ఎకరాలు కావాలని పోర్టు అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. వారు ఓకే అన్నారు. రామాయపట్నం పోర్టు కోసం ప్రకాశం జిల్లాలో మొత్తం 3,773 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనిలో పోర్టుకే 3,420 పోతే, మిగిలింది పరిశ్రమల స్థాపనకు. అదే పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మాత్రం పరిశ్రమల కోసం ఏపీఐఐసీ ద్వారా 6,500 ఎకరాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోర్టు కోసం సర్వం త్యాగం చేసిన ప్రకాశం జిల్లాలో కొద్ది ఎకరాల్లో పరిశ్రమలు.., ఒక్క ఎకరా భూమి కూడా పోర్టు కోసం త్యాగం చేయని నెల్లూరు జిల్లాలో మాత్రం 6,500 ఎకరాల్లో పరిశ్రమల స్థాపన. ఇదేం న్యాయం.
పోర్టు మాత్రమే జిల్లాలో ఉండి అభివృద్ధి అంతా నెల్లూరు జిల్లా పరిధిలో జరిగేలా అధికార పార్టీలోని నెల్లూరు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మన ప్రయోజనాలు మన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకోరా.. అని వారం క్రితం జరిగిన సమావేశంలో కలెక్టర్ని వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట ప్రశ్నించారు. మధ్యలో జోక్యం చేసుకున్న పోర్టు సి.ఈ.ఓ అంతగా ఇబ్బంది అయితే.., పోర్టును నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేస్తామనే మాట అనడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా పోర్టును ఎక్కడ బడితే అక్కడ ఏర్పాటు చేయడానికి అదేమీ ఆర్.టి.సి బస్టాండ్ కాదని రాజకీయ నాయకులు, అధికారులకు అందరికీ తెలుసు. పోర్టు కూడా నెల్లూరు జిల్లాలోనే పెట్టుకోండి అని మానుగుంట అన్నా వారు తీసుకెల్లే పరిస్థితి లేదు. వైసీపీ ఎమ్మెల్యే ఎంత ప్రశ్నించినా ప్రకాశం జిల్లాలోని ఇద్దరు మంత్రులు, మిగతా 11 ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా వారం అయినా ఈ రోజుకీ పెదవి విప్పలేదు. ప్రకాశం భవిష్యత్తును పోర్టు పేరుతో నెల్లూరు జిల్లాకు ఇచ్చేశారని, ఇక చేసేది ఏమీ లేదని , చెప్పినా అధిష్టానం వినదని మౌనం దాల్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఒక్క ఎకరా కూడా ఎందుకు తీసుకోలేదు..?
రామాయపట్నం పోర్టు కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండలంలో నిర్మాణం కాబోతోంది. కానీ, ఆ మండలంలో ఇప్పటి వరకూ ఎ.పి.ఐ.ఐ.సి భూములు సేకరించడం లేదు. ఇప్పుడు ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే పోర్టు ఉన్న ప్రాంతంలోని భూముల్ని భవిష్యత్తులో అమరావతిలో కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే భవిష్యత్తులో కోట్లలో రియల్ ఎస్టేట్ ద్వారా అమ్మడానికి రాజకీయ నేతలు, బడా పారిశ్రామిక వేత్తలు ప్లాన్లు వేశారా?? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
రామాయపట్నం పోర్టు నిర్మాణం ప్రకాశం జిల్లా బతుకును మారుస్తుందో..? లేక వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట అనుమానించినట్లు ప్రకాశం జిల్లాకు టోపీ అవుతుందో చూడాలి… కాలమే దీనికి సమాధానం చెపుతుంది..!