పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని,50 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాల్సిన ప్రాజెక్టు పనులు అటకెక్కించారని టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.పోలవరం స్పిల్ వే,స్పిల్ ఛానల్ ముంపు గ్రామాలను ఖాళీ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రూ.1500 కోట్లు చెల్లించినట్లు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ గుర్తు చేశారు.టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 71.2 శాతం పూర్తి చేశామని ఆయన తెలిపారు.2021 జూన్ కల్లా అంటే ఇప్పటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు అటకెక్కించారని,మరో రెండు సంవత్సరాలకు కూడా పనులు పూర్తి చేసేలా లేరని దేవినేని విమర్శించారు.కేంద్ర జల సంఘం చెప్పినా వినకుండా బావర్,ఎల్ అండ్ టీ కంపెనీలను తొలగించారని,ఏడాది పాటు రివర్స్ టెండర్ల పేరుతో కాలయాపన చేశారని దేవినేని తప్పు పట్టారు.
వరద వస్తే రూ.300 కోట్ల నష్టం..
రివర్స్ టెండర్ల పేరుతో ఏడాది పాటు పోలవరం పనులు నిలిపివేయడం వల్ల ఈ నెలలో పూర్తి కావాల్సిన పనులు పూర్తి కాకుండా చేశారని సీఎం జగన్మోహన్రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం పనులు భ్రష్టు పట్టించారని ఆయన ధ్వజమెత్తారు.పోలవరం పనులపై సీఎం జగన్ ఎన్నిసార్లు సమీక్షించారని దేవినేని ప్రశ్నించారు.డయాఫ్రం వాల్ పనులు గాలికి వదిలేయడం వల్లే నేడు ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పోలవరం నిర్వాసితులకు ఎకరానికి పది లక్షలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి దమ్ముంటే ఇవాళ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించాలని దేవినేని సవాల్ విసిరారు.పోలవరం నిర్వాసితులకు రెండేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఎర్త్ కం రాక్ పిల్ డ్యాం పనులు పూర్తి చేయకపోవడం వల్ల దానిపై వరద వస్తే రూ.300 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని దేవినేని ఆందోళన వ్యక్తం చేశారు.రివర్స్ టెండర్ల ద్వారా రూ.1700 కోట్లు మిగిలాయని చెప్పి,తాజాగా రూ.2500 కోట్ల కొత్త పనులు అదే కంపెనీకి అప్పగించి కమీషన్లు దండుకుంటున్నారని దేవినేని విమర్శించారు.పందికొక్కుల్లా పోలవరం ప్రాజెక్టు పనుల్లో దోచుకుంటున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.14 ప్రాజెక్టులు పూర్తి చేశామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెపుతున్నాడని,ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.
Must Read ;- కాఫర్ డ్యామ్తో మునిగిపోమా.. పోలవరం టూర్లో మంత్రి అనిల్కు నిరసన సెగ