విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం 2’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీలో ఈ సినిమా విడుదలవుతోంది. మలయాళ చిత్రం రీమేక్ గా ఇది రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా రూపొందింది. క్రైమ్ థ్రిల్లర్ దృశ్యంకు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. వరుణ్ హత్య కేసులో రాంబాబు కుటుంబం పోలీసులకు దొరికిపోయిందా? రాంబాబు తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఏం చేశాడు? అనే ప్రధాన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.
అనూప్ రూబెన్స్ దీనికి సంగీతం అందించారు. దీని ట్రైలర్ ను కూడా ఈరోజు విడదుల చేశారు. వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో వెంకటేష్, మీనా, నరేష్, రేవతి తదితరులు పాల్గొన్నారు. వరుణ్ హత్య అనంతరం కేబుల్ టీవీ రాంబాబు సినిమా థియేటర్ నడపడం, నిర్మాతగా మారి ఓ సినిమా తీసే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాన్ని ట్రైలర్ ద్వారానే చూపించారు. ‘ఈ సినిమా తీయడం మనకు అవసరం అంటావా?’ అంటూ మీనా వెంకటేష్ ను ప్రశ్నిస్తుంది. అక్క చేసిన తప్పును చెల్లి రివీల్ చేయడంతో తిప్పలు వస్తాయన్న సస్పెన్స్ ను ఈ ట్రైలర్ లో క్రియేట్ చేశారు.
పోలీస్ అధికారిగా సంపత్ రాజ్ డైలాగులు కూడా చూపించారు. ‘ఇప్పుడు రాంబాబు ఫోకస్ మొత్తం సినిమా మీద ఉంది. చట్టానికి దొరకనన్న ఓవర్ కాన్షిడెన్స్ తో ఉన్నాడు. వాడు సినిమా తీసే లోపు వాడికి సినిమా చూపిద్దాం’ అంటాడు సంపత్ రాజ్. నరేష్, నదియా, సత్యం రాజేష్, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా రూపొందింది. ‘భయపడకు.. మీ ముగ్గురికీ ఏమీ జరగనివ్వను’ అంటూ రాంబాబు పాత్రధారి భార్యకు ధైర్యం చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగించారు. మరి ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. అనూప్ రూబెన్స్ రీరికార్డింగ్ బాగుంది.
Must Read ;- అలా వారి పోస్టులకు అర్థాలే వేరులే?