ట్రిపుల్ ఆర్ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ సినిమా ‘గంగూభాయి కతియావాడి’ కూడా జనవరి 6న విడుదల కావలసి ఉంది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. భారీ స్థాయిలో రూపొందిన ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా విడుదల సమయంలో వేరే సినిమాలు విడుదలైతే అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందుకే చాలా మంది ఇతర నిర్మాతలు తమ సినిమాల విడుదల ఆ సమయంలో కాకుండా వాయిదా వేశారు.
ఈ గంగూభాయి చిత్రాన్ని కూడా ఆ సమయంలో విడుదల చేయకుండా వాయిదా వేయాల్సిందిగా దర్శకుడు రాజమౌళి ఆలియా భట్ ద్వారా ఆ చిత్ర దర్శకనిర్మాతల్ని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. ఆమేరకు ఆ సినిమా విడుదల ఫిబ్రవరికి వెళ్లిపోయింది. ఇలా వాయిదా వేసి ట్రిపుల్ ఆర్ మీద దయచూపినందుకు ఆ చిత్ర నిర్మాత జయంతీ లాల్ గడ, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీలకు రాజమౌళి ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. ట్రిపుల్ ఆర్ ప్రచార దూకుడు పెంచింది. అంతేకాదు గంగూభాయిలో కూడా అజయ్ దేవగణ్ ఉన్నారు.
ఇలా ఇద్దరు నటులు ఒకే చిత్రంలో ఉండటం కూడా ఇబ్బంది కరమే. ‘గంగూబాయి కతియావాడి’ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా. మాఫియా క్వీన్ గంగా హర్జీవందాస్ బయోపిక్ ఇది. ఇందులో ఇంకా ఇమ్రాన్ హష్మీ, విజయ్ రాజ్, ఇందిరా తివారీ, సీమా పహ్వా కూడా నటించారు. ట్రిపుల్ ఆర్ కోసం సంక్రాంతికి విడుదల కావలసిన కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. సంక్రాంతి బరిలో ఉన్న మహేష్ బాబు సర్కారువారి పాట విడుదల వాయిదా పడింది. ఇక మిగిలింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’.
ఈ సినిమాని జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ జనవరి 26కు విడుదల తేదీ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఒక్క ‘రాధేశ్యామ్’ మాత్రమే ట్రిపుల్ ఆర్ తో కలిసి సంక్రాంతి బరిలో ఉండబోతోంది. సాధారణ సినిమా అయితే వారం గ్యాప్ ఉంటే ఫరవాలేదు. ట్రిపుల్ ఆర్ పరిధి పెద్దది కాబట్టి రెండు వారాల వ్యవధి అవసరం. అందుకే వచ్చే సంక్రాంతి బరిలో రెండు సినిమాలు మాత్రమే నిలిచే అవకాశం ఉంది.
Must Read ;- ఎన్టీఆర్, కొరటాల మూవీకి బ్రేక్ పడిందా?