డెక్కన్ క్రానికల్ చైర్మన్ టి. వెంకట్రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ టి. వినాయక్ రవి రెడ్డిలకు చెందిన 122.15 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2002 ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై, బెంగళూరులలో ఉన్న 14 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ అటాచ్డ్ ఆస్తులన్నీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పరిధిలో లేవని స్పష్టం చేసింది. ఇప్పటికే మొదటి విడతగా డీసీహెచ్ఎల్ ప్రమోటర్లకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా చేసిన అటాచ్ తో ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ .264.56 కోట్లకు చేరింది
తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై దక్కన్ క్రానికల్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ టి.వినాయక్ రవి రెడ్డిలపై గతంలోనే సీబీఐ కేసులు నమోదు చేసింది. మని లాండరింగ్ జరిగిందని నిర్దారణ కావడంతో ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. బ్యాంకింగ్ సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు చేసిన ఫిర్యాదులతో ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కేసులతో బాటు డీసీహెచ్ఎల్ పై సిసిఎస్ పోలీసులు కూడా చార్జిషీట్ను దాఖలు చేశారు. సెక్యూరిటీల మార్కెట్లో లావాదేవీలు నిర్వహించకుండా డెక్కన్ క్రానికల్ చైర్మన్ టి. వెంకట్రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ టి. వినాయక్ రవి రెడ్డి, పరుశురామన్ కార్తీక్ అయ్యర్, ఎమ్డీ, ఎన్. కృష్ణన్లపై రెండేళ్లపాటు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ కూడా నిషేధం విధించింది.
డీసీహెచ్ఎల్ ప్రమోటర్లు ఎగవేసిన రుణాల మొత్తం రూ. 8180 కోట్లగా ఈడీ నిర్దారించింది. దీంతో డీసీహెచ్ఎల్ కంపెనీని బ్యాంకింగ్ సంస్థలో కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజ్యులేషన్ ప్రాసెస్ లో ఉన్నాయి. దీనిలో 400 కోట్ల రూపాయల రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద జరిపిన విచారణలో డీసీహెచ్ఎల్ ప్రమోటర్ల మోసాలు వెలుగు చూశాయి. మోసానికి పాల్పడి కంపెనీ బ్యాలన్స్ షీట్లను తారుమారు చేశారని తేలింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి బ్యాంకులను షేర్ హోల్డర్స్ లను మోసం చేశారని నిర్దారణ చేసింది. తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడమే గాక ఆ సమాచారాన్ని దాచి పెట్టి ఫైనాన్స్ సంస్థల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని విచారణలో తేలింది.
చాలా సంవత్సరాలుగా డీసీహెచ్ఎల్15 వేల కోట్లకు పైగా రుణ సదుపాయాలను పొందింది. మనీ ట్రైల్ దర్యాప్తులో చాలావరకు రుణాలు డైవర్ట్ అయ్యాయని రుజువయ్యింది. అలాగే పాత రుణాలను తీర్చేందుకు కొత్త రుణాలు తీసుకున్నట్లు దర్యాప్తులో నిర్దారణ అయింది. పెట్టుబడుల కోసం తీసుకున్న రుణాలు వేరే ప్రాజెక్టులకు మళ్లించబడటం, బ్యాంకుల అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులలోకి నిధులను మళ్లించడం వాటిని చివరికి నష్టాలుగా చూపించడం లాంటి చర్యలకు డీసీహెచ్ఎల్ కంపెనీ చేసిందని విచారణలో తేలింది. రుణాల నుండి గణనీయమైన మొత్తాలు ఎటువంటి చట్టబద్ధమైన వ్యాపారం చేయని అనుబంధ సంస్థలకు, సరైన అకౌంటింగ్ లేకుండా ఇద్దరు మాజీ ప్రమోటర్ల సంస్థలకు మళ్లించబడ్డాయి. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ నడుపుతూ కూడా అన్నీ నిబంధనలను తుంగలో తొక్కారని విచారణలో స్పష్టమైంది.
సీఐఆర్పీ ఈ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, డీసీహెచ్ఎల్ నిందితులు ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యుల విషయాల్లో ప్రింట్ మీడియా వద్ద గోప్యత పాటిస్తున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా పెద్ద మొత్తంలో నెలవారీ జీతాలు తీసుకునే స్థాయిలో కూడా కొందరు పని చేస్తున్నారని పీఎంఎల్ ఈడీ దర్యాప్తులో తెలిసింది. యమ్/డీసీహెచ్ఎల్ కింద రిజిస్టార్ చేసిన హై ఎండ్ వాహనాలను ఈడీ వారి నుంచి స్వాధీనం చేసుకుంది. ప్రమోటర్లు వారి వద్ద తనఖా పెట్టిన ఆస్తులను, ఫ్రంట్ కంపెనీ ద్వారా దాచిన ఆదాయాన్ని ప్రైవేటు ఒప్పందాల ద్వారా రాయితీ రేటుకు తిరిగి కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. బ్యాంకులు/ఎన్ బీ ఎఫ్ సీ/ ఆర్థిక సంస్థలకు సంబంధించిన నికర మొత్తం రూ. 8180 కోట్లుగా అంచనా. చెల్లించని ప్రధాన రుణ మొత్తం సుమారు రూ.3000 కోట్లు. అయితే ఇప్పటి వరకు ఆస్తులు మొత్తం పీఎంఎల్ఏ కింద రూ.264.56 కోట్లు గుర్తించి తాత్కాలికంగా జత చేశారు.