( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాక … డిప్యూటీ మేయర్ విషయంలో కొత్త విధానాన్ని విశాఖలో అమలు చేసేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. మేయర్ అభ్యర్థిగా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ.. వారిని పక్కనపెట్టి మంత్రి మొత్తంశెట్టి తన కుమార్తెకు ఆ హోదా కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ కేడర్ లో ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారిని పక్కనపెట్టి నిన్నకాక మొన్న రాజకీయాలు ప్రారంభించి, గెలుపొందిన వెంటనే మేయర్ లాంటి ఉన్నత పదవిని కట్టబెట్టడం వల్ల పార్టీలో సీనియర్లు ఇతర నాయకుల నుంచి వ్యతిరేకత రాకుండా డిప్యూటీ సీఎం లాంటి వ్యూహాన్ని అమలు చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.
నలుగురికి డిప్యూటీ మేయర్ అవకాశం…
దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ల నియామకాన్ని జగన్ సర్కార్ అమలు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో గ్రేటర్ విశాఖలో డిప్యూటీ మేయర్ లను నియమించాలని పార్టీ భావిస్తున్నట్టు ఆ పార్టీలో ముఖ్యుల ద్వారా తెలుస్తోంది. తొలి రెండున్నరేళ్లు ఒకరికి మరో రెండున్నరేళ్లు ఇంకొకరికి మేయర్గా అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నలుగురు డిప్యూటీ మేయర్ లను నియమించడం వల్ల ఎక్కువమందికి ఈ హోదా, ఉపాధి, కల్పించినట్లు అవుతుందని ఆ పార్టీ నేతల అభిప్రాయంగా ప్రచారంలో ఉంది. ఈ విధంగా చేయడం వల్ల అసంతృప్తులకు అవకాశం ఉండదని, తరువాత తమకు అవకాశం వస్తుందని ఓపిక గా ఎదురు చూస్తారు అని ఆ పార్టీ నేతల ఉద్దేశంగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు విశాఖ మేయర్ అభ్యర్థి పేరును కూడా ప్రకటించలేదని ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో సాధించిన సీట్ల ఆధారంగా ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read ;- అమీతుమీకు కార్మిక సంఘాలు సిద్ధం.. 25 తరువాత ఏ క్షణంలోనైనా విశాఖ ఉక్కులో సమ్మె
బీసీ జనరల్ కు కేటాయింపు..
విశాఖ మేయర్ స్థానాన్ని బిసి జనరల్ కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ అధికారపార్టీ మేయర్ అభ్యర్థి ఎవరన్నది పోలింగ్ ముగిసినా బయటకు వెల్లడి కాలేదు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీనియర్ నేతలకు అవకాశం దక్కుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే బీసీ మహిళను ఆస్థానంలో కూర్చోబెట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వంశీకృష్ణ పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. ప్రధానంగా 21 వ వార్డు అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ప్రాంతానికి చెందిన శరగడం చిన అప్పలనాయుడు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీకృష్ణ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో ఇద్దరు అభ్యర్థులు ఓడిపోయే ప్రమాదం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దాని వెనుక పథకం ప్రకారం ఒక కుట్ర కూడా జరిగిందని విమర్శలు పార్టీ కార్యకర్తల నోటివెంట వినిపిస్తోంది.
మేయర్ పీఠాన్ని కానుకగా…
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విశాఖ మేయర్ పీఠాన్ని కానుకగా ఇస్తామని టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం ప్రకటించారు. ఇప్పటికే రకరకాల సమీకరణాలు చేసుకున్న ఆ పార్టీ నేతలు మేయర్ స్థానం దక్కించుకోవడం ఖాయమని నిర్ణయానికి వచ్చారు. విశాఖలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని వార్డులలో పరిస్థితులను స్వయంగా ఆయనే పర్యవేక్షించారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల్లో నిర్లక్ష్యం, పంపిణీల వ్యవహారంలో కక్కుర్తి ప్రదర్శిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న ఆయన క్షణాల్లో అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించి క్లాస్ పీకారు. అవసరమైన అభ్యర్థులకు అదనపు సాయం కూడా చేశారు. ఓటింగ్ సరళిపైన ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి అనుకూల ఓట్లు పోలయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎంతో అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ కన్నా ఒకరకంగా పోలింగ్ మేనేజ్మెంట్లో వైఎస్ఆర్సిపి మెరుగైన స్ట్రాటజీని ఫాలో అయ్యిందని జివిఎంసి ఎన్నికలను నిశితంగా పరిశీలించిన వారికి ఇట్టే అర్థమవుతుంది.
Must Read ;- గెలిపించకపోతే ఉద్యోగాలు ఊస్టే.. విశాఖలో అధికారుల హెచ్చరికలు











