విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను చేసిన రాజీనామాను వెనక్కు తీసుకునేది లేదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తిరుపతిలో స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతోందని, ఏపీ ప్రజాప్రతినిధులు కళ్లు తెరవకుంటే ప్రమాదం తప్పదన్నారు. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఆయన తిరుపతిలో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ ఉక్కును నూరు శాతం ప్రైవేటీకరిస్తామని స్పష్టంగా చెప్పిన తరవాత కూడా ఏపీ బీజేపీ నేతలు నాటకం ఆడుతున్నారని ఆయన విమర్శించారు. అన్ని పార్టీల నేతలు ఏకమై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కోసం ఎవరైనా రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గంలో పోటీకి నిలపబోమని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాలి
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పోరాటానికి దిగాలని గంటా శ్రీనివాసరావు విజ్ఙప్తి చేశారు. విశాఖ ఉక్కు పోరాటంలో పవన్ కళ్యాణ్ పాల్గొనాలని ఆయన కోరారు. ఏపీలోని అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు ఏకమై పోరాడితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం బిడ్డింగ్కు కూడా సిద్దమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Must Read ;- ఆందోళనలకు దూరం.. విశాఖ ఉక్కు విషయంలో జనసేనాని అస్త్రసన్యాసమా..?











