ఇంటర్ పరీక్షల నిర్వహణ మీద పునరాలోచన చేయాల్సిందిగా ఏపీ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు వదిలేయడంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణపై జాతీయ విధానం అంటూ ఏమీ లేదన్నారు. మంచి మార్కులు సాధిస్తే విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయనే ఒకే ఒక్క ఉద్దేశంలో పరీక్షలు నిర్వహించాలని భావించామని సురేష్ గుర్తు చేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని..
కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పరీక్షా కేంద్రాల్లో ఆరోగ్యపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని భావించామని విద్యామంత్రి తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించామన్నారు. విద్యార్ధుల ప్రాక్టికల్స్ పూర్తి అయ్యాయి కాబట్టి, ఇక మిగిలి ఉన్న పరీక్షల ప్రక్రియ 6 రోజులు మాత్రమేనని అది కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పరీక్షల నిర్వహణ మీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ప్రకటిస్తున్నామని విద్యామంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.
Must Read ;- పది, ఇంటర్ పరీక్షలపై పున:పరిశీలన చేయండి.. హైకోర్టు











