ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా వైరస్ తన సెకండ్ వేవ్తో మరోమారు మరణ మృదంగాన్నే సృష్టస్తోంది. కరోనా సెకండ్ వేవ్తో దేశంలో తొలి దశ కంటే కూడా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల కింద కేంద్రం ఇప్పటికే పకడ్బందీ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సీబీఎస్ఈకి సంబంధించి పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. వాటితో ఇంటర్ తొలి సంవత్సవరం పరీక్షలను రద్దు చేసిన కేంద్రం సెకండియర్ పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా టెన్త్ పరీక్షలను రద్దు చేసేసింది. అయితే కరోనా కేసుల్లో తెలంగాణ కంటే ఓ అడుగు ముందే ఉన్న ఏపీ మాత్రం పది పరీక్షలను నిర్వహించి తీరతామని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ కీలక ప్రకటన చేశారు. ఓ వైపు కరోనాతో యావత్తు దేశం హడలిపోతూ ఉంటే… వేలాది కేసులు నమోదవుతున్న ఏపీ మాత్రం తమ విద్యార్థులకేమీ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు ప్రశ్నార్ధకంగా మారుతోంది.
చాలా రాష్ట్రాల్లో పకడ్బందీ కట్టడి చర్యలు..
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు పకడ్బందీ కట్టడి చర్యలు ప్రారంభించాయి. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కారు కరోనాతో పాఠశాలల విద్యార్థులకు ఎక్కడ ముప్పు వాటిల్లుతోందోనన్న భయంతో ఏకంగా సీబీఎస్ ఈ పరీక్షలను రద్దు చేసి పారేసింది. ఇంటర్, డిగ్రీ విద్యకు అనుసంధానంగా ఉన్న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన మోదీ సర్కారు… వాటిని కూడా రద్దు చేసే దిశగానే అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు కూడా కరోనా కట్టడి చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. మిగిలిన తరగతుల పరీక్షలు కూడా దాదాపుగా రద్దైనట్టుగానే భావించక తప్పదు. కరోనా కట్టడిపై కేసీఆర్ సర్కారు ఇంత కఠిన చర్యలు తీసుకుంటున్నా… తెలంగాణ హైకోర్టు ఇంకా సర్కారు చర్యలపై అసహనం వ్యక్తం చేసిన వైనం గమనించాలి.
1 నుంచి 9 తరగతుల పరీక్షల రద్దు
ఇలాంటి నేపథ్యంలో సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్… పాఠశాలల నిర్వహణ, పరీక్షలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా సోమవారం ఈ తరగతుల వారికి విద్యా సంవత్సరం ముగిసిందని కూడా ఆయన ప్రకటించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా… కీలకమైన పదో తరగతి పరీక్షలను మాత్రం నిర్వహించి తీరతామని సురేశ్ చేసిన ప్రకటన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని చెప్పాలి. టెన్త్తో పాటు ఇంటర్ పరీక్షలను ఇంతకుముందే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పిన సురేశ్… కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సురేశ్ వినిపించిన వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. కరోనా కారణంగానే గతేడాది టెన్త్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా గతేడాది టెన్త్ ముగించిన విద్యార్థులకు మిలిటరీలోకి ప్రవేశానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తాయని, ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు రాకూడదన్న భావనతోనే కష్టమైనా కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఏపీలో మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరతామమంటూ..
ఓ వైపు కేంద్రం ఏకంగా సీబీఎస్ఈ స్ట్రీమ్లో టెన్త్తో పాటు ఫస్ట్ ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ కూడా టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా టెన్త్ పరీక్షలను రద్దు చేసే అవకాశాలే ఎక్కువ. అయితే అందుకు విరుద్ధంగా ఏపీలో మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరతామని జగన్ సర్కారు చెబుతున్న తీరుపై విస్మయం కలుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం కర్నూలు జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో ఏకంగా 53 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. ఇలాంటి పరిస్థితులను చూస్తూ కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరతామని ఏపీ సర్కారు చెబుతున్న తీరు నిజంగానే వివాదాస్పదంగా మారే అవకాశాలున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. సీబీఎస్ ఈ టెన్త్ పరీక్షలే రద్దు అవుతున్న నేపథ్యంలో ఏ ఒక్క రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తలెత్తని ఇబ్బంది ఏపీ విద్యార్థులకే తలెత్తుతోందని జగన్ సర్కారు వాదిస్తుండటం నిజంగానే ఆందోళనకు గురి చేసేదేనని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో స్వయంగా హైకోర్టు రంగంలోకి దిగి జగన్ సర్కారుకు మొట్టికాయలు వేస్తే గానీ… సర్కారు తీరులో మార్పు రాదేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు, ఇంటర్ వాయిదా