Jagan Government Decides To Use State Guest House In Vijayawada For Business Purposes :
ఏపీలో జగన్ సర్కారు అవలంభిస్తున్న విధానాలు పెను వివాదాలనే సృష్టిస్తున్నాయి. తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించుకున్న భూములను అమ్మేందుకు యత్నించిన జగన్ సర్కారు.. భక్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆలయ భూములను వదిలేసిన జగన్ సర్కారు.. ఏకంగా సర్కారీ భూములనే విక్రయించేందుకు సాహసించింది. దీనిపై ఫిర్యాదులు అందుకున్న హైకోర్టు జగన్ సర్కారుకు బ్రేకులేసింది. ఇలా కుదరదనుకుందో, ఏమో గానీ.. జగన్ సర్కారు సర్కారు భూములు, ఆస్తులను కేంద్రంగా చేసుకుని నయా దందాకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విశాఖలోని రిషికొండలో ఉన్న ఏపీటీడీసీ రిస్టార్ట్ ను కూలగొట్టి.. దాని స్థానంలో కొత్త రిసార్ట్ కట్టేందుకు సిద్ధమైన జగన్ ప్రభుత్వం.. తాజాగా విజయవాడ నడిబొడ్డులోని స్టేట్ గెస్ట్ హౌస్ ను ఏకంగా వాణిజ్య కార్యకాలపాలకు అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై విపక్షాలతో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటుకు స్టేట్ గెస్ట్ హౌస్
విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ స్థానంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి ప్రైవేట్ కార్యకలాపాలకు తెర తీయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో బెజవాడ స్టేట్ గెస్ట్ హౌస్కు ఉన్న చరిత్రను జనం గుర్తు చేసుకుంటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న 3.26 ఎకరాల్లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ విలువ రూ.1,500 వందల కోట్లకుపైగానే ఉంటుంది.స్టేట్ గెస్ట్ హౌస్ ను వాణిజ్య భవనంగా మార్చాలని ప్రతిపాదన చేశారు. ఈ బాధ్యతలు కూడా భూములు అమ్మకాలు చూస్తున్న నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ సంస్థకే ఇచ్చారు. 3.26 ఎకరాల్లో వాణిజ్య భవనంగా అభివృద్ధి చేసి .. లీజుకివ్వడమో.. అమ్మడమో చేయబోతున్నారు. ఇందుకోసం డిజైన్లు అందించేందుకు రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ దిశగా జగన్ సర్కారు చర్యలు చూస్తుంటే.. మరికొన్ని రోజుల్లో స్టేట్ గెస్ట్ హౌస్ అదృశ్యం కానుందని, అక్కడ కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ కనిపించనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదో రకంగా అమ్మకమే
స్టేట్ గెస్ట్ హౌస్ స్థలంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడమంటే.. అక్కడ ఇక స్టేట్ గెస్ట్ హౌస్ ఎలాగుంటుంది? ఇదే ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న. ఉంటే.. స్టేట్ గెస్ట్ హౌస్ అయినా ఉండాలి.. లేదంటే భారీ కమర్షియల్ కాంప్లెక్స్ అయినా ఉండాలి. రెండూ అక్కడ ఉండటం అసాధ్యమే కదా. మరి గెస్ట్ హౌస్ స్థలంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం అంటే.. స్టేట్ గెస్ట్ హౌస్ ను తొలగిస్తున్నట్లే కదా. మరి అక్కడి స్టేట్ గెస్ట్ హౌస్ ను తొలగించి కమర్షియల్ కాంప్లెక్స్ కడితే.. అందులో అంతా ప్రైవేట్ వ్యాపారం జరుగుతుంది కదా. మరి అక్కడ ప్రభుత్వ పెత్తనం గానీ, పర్యవేక్షణ గానీ ఉండవు కదా. అదే జరిగితే.. స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని జగన్ సర్కారు అమ్మేసినట్టే కదా. నేరుగా అమ్ముతున్నాం అని చెప్పకుండా దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టడమే కదా. మరి దీనిని ప్రతిపక్షాలు గానీ, ప్రజలు గానీ ఎలా అడ్డగిస్తాయో చూడాలి.
Must Read ;- 100 కోట్ట ఆస్తి 19 కోట్లకే.. బుక్కైన వైసీపీ ఎమ్మెల్యే











