ఏపీలో జగన్ సర్కారు సంక్షేమ పథకాలకు పంచటానికి ప్రభుత్వ భూములను బ్యాంకులకు తనఖా పెట్టి రుణాలు పొందుతోంది. దీని కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు రుణాలు పొందేందుకు పరిపాలనా రాజథానిగా ప్రకటించిన విశాఖలోని 213 ఎకరాలను తనఖా పెట్టే ప్రక్రియను పూర్తి చేశారు. ఆర్థిక శాఖ అధికారులు గురు,శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు రూ,21,500 కోట్లు రుణాలు పొందేందుకు విశాఖలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తులను బ్యాంకులకు కుదవ పెట్టారు.
మూడు సంక్షేమ కార్యక్రమాల అమలుకు..
రాష్ట్రంలో మూడు సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసేందుకు జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. వైస్పార్ ఆసరా కింద రూ.6,337 కోట్లు, అమ్మఒడికి రూ.6,107 కోట్లు,వైఎస్పార్ చేయూతకు రూ.4,455 కోట్లు ఈ కార్పొరేషన్కు రుణాల ద్వారా సమకూర్చిన నిధులనే వినియోగించనున్నారు.
2020 నవంబరులోనే ఒప్పందం
2020 నవంబరులో ప్రారంభమైన రుణ సమీకరణలో భాగంగా చేసుకున్న ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. ఈ వ్యవహారానికి రాష్ట్ర మంత్రి మండలి గతంలోనే ఆమోదముద్ర వేసిందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ను రూ.21,500 కోట్ల రుణ సమీకరణకు వీలుగా ప్రభుత్వం ఈ గ్యారంటీలు సమకూర్చింది. ఆ మేరకు కార్పొరేషన్ అధికారులు 2020 నవంబరు 5న బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తిరిగి నవంబరు 24న గ్యారంటీ డీడ్ రాశారు. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.6,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.5,000 కోట్లు, ఇండియన్ బ్యాంకు రూ.2,500 కోట్లు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.5,000 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.3,000 కోట్లు రుణాలు పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. భూముల గ్యారంటీ మాత్రమే కాకుండా అదనపు ఎక్సైజ్ సుంకాన్ని నేరుగా రుణ చెల్లింపుల కోసం వినియోగించుకునే ఏర్పాట్లు చేసింది. అదనంగా ఎక్సైజ్ సుంకం విధించి దాన్ని రాష్ట్ర కార్పస్ ఫండ్కు చేర్చి, అక్కడి నుంచి వచ్చిన ఆ మొత్తాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చేర్చేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 10 ఎక్సైజ్ డిపోల నుంచి వసూలయ్యే మొత్తాన్ని ఇలా ప్రతి నెలా చెల్లిస్తారు. ఇది కాకుండా రుణం పొందేందుకు బ్యాంకులు రుణ మొత్తంలో 10 శాతానికి ఆస్తులను తనఖా పెట్టాలన్న డిమాండు మేరకు ఇప్పుడు విశాఖలోని 213 ఎకరాలను కుదవ పెట్టారు. విశాఖలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన 213 ఎకరాలు రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ తరఫున బ్యాంకులకు కుదువపెట్టేందుకు గుర్తించారు. వాటిని భూపరిపాలన కమిషనర్కు బదలాయించి అక్కడి నుంచి ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ఆమోదం పొందారు. తర్వాత రాష్ట్ర ఆర్థికశాఖ ద్వారా కార్పొరేషన్కు బదలాయించి కుదువ ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి అధికారులు వెళ్లి ఆ డాక్యుమెంట్లు అన్నీ విశాఖలోని స్టేట్ బ్యాంకు ప్రతినిధులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కారణం వల్ల ఆ రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించలేక పోతే ఆ భూములను వేలం వేసుకుని తమ అప్పులు జమ చేసుకునే వెసులుబాటు బ్యాంకులకు కల్పించినట్లేనని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Must Read ;- ముందు అప్పు చేయ్.. తర్వాత తప్పు చేయ్











