తెలుగులో తొలి సినిమాతోనే కీర్తి సురేశ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ సినిమాతో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఆ క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో ఆమె తెలివిగా వ్యవహరించలేదనే చెప్పాలి. అంతేకాదు కాస్త బొద్దుగా ఉండటం వల్లనే తనకి ‘మహానటి‘లో అవకాశం వచ్చిందనే విషయం మరిచిపోయి సన్నబడిపోయింది. చక్కనమ్మ చిక్కినా అందమే కానీ, హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆ మాట వర్తించదు. హీరోయిన్ కాస్త కండపట్టి ఉంటేనే ప్రేక్షకులు ఇదైపోతారు .. ఇష్టపడతారు.

‘మహానటి’ తరువాత కీర్తి సురేశ్ బరువు తగ్గడమే కాకుండా మరో పొరపాటు కూడా చేసింది. ‘మహానటి’లానే నాయిక ప్రాధాన్యత కలిగిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆ పొరపాటు. ‘నేను శైలజ’ తరహా కథలతో ఆమె మళ్లీ అలరిస్తుందని అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. పోనీ నాయిక ప్రాధాన్యత కలిగిన కథల్లో సక్సెస్ ను అందుకుందా అంటే అదీ లేదు. ‘పెంగ్విన్’ .. ‘మిస్ ఇండియా’ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. కీర్తి సురేశ్ లో ప్రత్యేకమైన ఆకర్షణ ఆమె బొద్దుగా ఉండటమే. బూరెల్లాంటి ఆమె బుగ్గలకు గంపలకొద్దీ అభిమానులు ఉన్నారు.
అలాంటి కీర్తి సురేశ్ బక్క చిక్కిపోయి ‘మిస్ ఇండియా‘ సినిమాలో కనిపించడం వాళ్లకి ఎంతమాత్రం నచ్చలేదు.దాంతో వాళ్లు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనని తాను తెరపై అలా చూసుకున్న కీర్తి సురేశ్ కి కూడా విషయం అర్థమైపోయి ఉంటుంది. అందుకే అప్పటి నుంచి ఆమె బరువు పెరగడం మొదలుపెట్టిందట. మహేశ్ బాబు సరసన చేయనున్న ‘సర్కారువారి పాట‘ సినిమాలో ఆమె ఎప్పటిలా ముద్దుగా బొద్దుగా కనిపించనుందని తెలుస్తోంది. ఈ రోజు నుంచే ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో మొదలుకానుంది. 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో నాయకా నాయికలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను .. పాటలను చిత్రీకరించనున్నారు.
Must Read ;- మహేశ్ కోసం ఛత్రపతి శివాజీ కథపై రాజమౌళి కసరత్తు?











