కర్నూలు జిల్లాకు చెందిన కీలక రాజకీయ నేత, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, టీటీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు అరెస్ట్ నుంచి తప్పించుకోలేరా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు ఏకంగా అజ్ఝాతంలోకి వెళ్లిపోయారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అసలు ఏవీ సుబ్బారెడ్డి కోసం పోలీసులు అంతగా ఎందుకు గాలిస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
భూమా మరణంతో కష్టాలు
టీడీపీ దివంగత నేత భూమా నాగిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగిన ఏవీ సుబ్బారెడ్డికి… భూమా మరణంతో కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. ఈ క్రమంలో భూమా వారసురాలిగా బరిలోకి దిగి మంత్రిగా కూడా పదవి అందుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో కూడా ఏవీకి తగాదాలు మొదలయ్యాయి. మొత్తంగా రాజకీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నా… ఎలాగోలా నిలదొక్కుకుంటూ వస్తున్న ఏవీ సుబ్బారెడ్డి చుట్టూ ఇప్పుడు చాలా పకడ్బందీగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన దాయాదీతో నెలకొన్న చిన్న వివాదాన్ని కేంద్రంగా చేసుకుని, దానినే అస్త్రంగా మలచిన రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలతో ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డి అడ్డంగా బుక్కవుతారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయినా ఇప్పుడు ఏవీ చుట్టూ ఎందుకు ఉచ్చు బిగుస్తోంది? దాని నేపథ్యం ఏమిటి? ప్రస్తుతం ఏవీ ఎక్కడున్నారు? అన్న వివరాల్లోకెళితే..
నంద్యాల కేంద్రంగానే రాజకీయాలు నడుపుతున్న ఏవీ సుబ్బారెడ్డి సొంతూరు ఆళ్లగడ్డ. నంద్యాలకు కూతవేటు దూరంలో ఉన్న ఆళ్లగడ్డపై పట్టు సాధించే దిశగా ఏవీ చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే గడచిన శనివారం ఏవీ సుబ్బారెడ్డి కుటుంబం, ఆయన దాయాదీ మోహన్ రెడ్డి కుటుంబాల మధ్య చిన్న తగాదా జరిగింది. అన్నదమ్ముల పిల్లలైన ఏవీ, మోహన్ రెడ్డిలు పక్క పక్క ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. వీరి ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోనే ఏవీ సుబ్బారెడ్డి తన కారును పార్క్ చేస్తున్నారు. ఈ కారు పార్కింగ్ విషయంలోనే ఇరు కుటుంబాలకు చెందిన మహిళల మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో ఏవీ ఆళ్లగడ్డలోనే లేరట. ఇక ఏవీ దాయాది అయిన మోహన్ రెడ్డి నంద్యాలలో త్రినేత్ర పేరిట లాడ్జి నడుపుతూనే… విశ్వహిందూ పరిషత్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శనివారం ఇంటి వద్ద జరిగిన చిన్న వివాదం, ఆ మరునాడే.. అంటే ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్లిన మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో మోహన్రెడ్డికి గాయాలు కాగా… ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వెళ్లిపోయారు.
Must Read ;- వైసీపీ నాయకుడి దౌర్జన్యం.. ఆలయ పూజారులపై రౌడీలతో దాడి

మోహన్రెడ్డి ఫిర్యాదుతో..
వరుసగా రెండు వివాదాల నేపథ్యంలో తనపై జరిగిన దాడికి ఏవీనే కారణమంటూ మోహన్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రెండు రోజులుగా పెద్దగా స్పందించని పోలీసులు… ఏ రాజకీయ శక్తులు ఎంటరయ్యాయో తెలియదు గానీ… మంగళవారం వేగంగా స్పందించారు. మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రతిని చేతిలో పెట్టుకుని రంగంలోకి దిగిపోయిన పోలీసులు.. ఏకంగా ఏవీని అరెస్ట్ చేసేందుకు ఆళ్లగడ్డలోని ఆయన ఇంటి తలుపు తట్టారు. అక్కడ ఏవీ లేరన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు...ఆయన కోసం వేచి చూడటానికి బదులుగా ఏకంగా హైదరాబాద్లోని ఏవీ నివాసానికి పరుగు అందుకున్నారు. తీరా హైదరాబాద్ వచ్చే సరికి అక్కడ కూడా ఏవీ లేరన్న విషయం తెలుసుకుని పోలీసులు ఉట్టి చేతులతోనే తిరుగు ముఖం పట్టారు. అంతిమంగా ఏవీ అజ్ఝాతంలోకి వెళ్లిపోయారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మొత్తంగా చిన్న తగాదా, అది కూడా దాయాదుల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం, ఆ క్రమంలోనే మోహన్ రెడ్డిపై జరిగిన దాడితో ముందూ వెనుకా చూసుకోకుండా ఏవీని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పోలీసులు కదులుతున్న తీరు చూస్తుంటే… ఈ కుటుంబ తగాదాను అడ్డం పెట్టుకుని ఏవీని రాజకీయంగా దెబ్బ కొట్టే యత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read ;- వైవీ ఎంట్రీతో వైపీసీలో.. బావాబామ్మర్దుల సవాల్!











