(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆధిపత్యపోరు.. ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న బూచేపల్లి.., పార్టీ ఇచ్చిన మాటను నమ్మి 2019 ఎన్నికల బరిలో దిగి విజయం సాధించి మద్దిశెట్టి ఇరువురూ ప్రతిష్టకు పోయి పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. రెండు వర్గాలు బాహాబాహాకి తలపడుతూ ఫ్యాను పరువును నడివీధిలో నిలబెడుతున్నాయి. ఇప్పుడు బూచేపల్లి వర్గం వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది.
పాత రోజులు మళ్లీ పునరావృతమయ్యేనా..?
రెండు రోజుల క్రితం ముండ్లమూరు బూచేపల్లి వర్గానికి వైసీపీ మండల కన్వీనర్ సూర్యదేవర అంజయ్య, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గానికి చెందిన అంబటి వెంకటేశ్వరరెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదులు చేశాయి. కానీ పోలీసులు ఎమ్మెల్యే ఫోన్ తో మద్దిశెట్టి వర్గం ఇచ్చిన ఫిర్యాదును రిజిస్టర్ చేసి.., బూచేపల్లి వర్గం ఫిర్యాదును పక్కన పెట్టారు. దీనిపై బూచేపల్లి వర్గం డిసెంబర్ 6న అద్దంకి పర్యటనకోసం జిల్లాకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది.
మరుక్షణం పోలీసులు బూచేపల్లి వర్గం వారి ఫిర్యాదుపై కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఇంతటితో ఆగని రెండు వర్గాలు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిసి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్యే మాటే నియోజకవర్గంలో ఫైనల్ అని ఇంతకు ముందు చెప్పామని.. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని ఇద్దరికీ బాలినేని మరోసారి స్పష్టం చేశారు.
Must Read ;- ఎమ్మెల్సీగా శుభంకార్డు : పోతుల సునీత కల నెరవేరేనా..?
కానీ, ఇక్కడ మరో విషయం కూడా కీలకంగా గమనించాల్సి ఉంది.
ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని వైవీ సుబ్బారెడ్డికి.., జగన్ గతంలోనే స్పష్టం చేశారు. గతంలో ఒంగోలు ఎంపీగా వైవీ పనిచేసిన సమయంలో ఆయన వర్గం వర్సెస్ బాలినేని మధ్య జరిగిన పోరుతో బాలినేని జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పుకుని జిల్లాకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బాలినేని మాటకు విలువ ఇచ్చిన జగన్.., వైవీని టీటీడీ ఛైర్మన్ గా నియమించి ఓ విధంగా జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని.., పార్టీ ఇతర బాధ్యతలు చూసుకోవాలని చెప్పారు.
ఆ తర్వాత, ఓ విధంగా ఇప్పుడే మొదటిసారి అన్నట్లుగా, వైవీ- బూచేపల్లి వర్గంకి మద్దతుగా నిలవడం ఆ పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే మద్దిశెట్టి, బూచేపల్లి గొడవలు పడుతూ అధిష్టానం మాట వినడం లేదని.., ఇప్పుడు వైవీ మద్దతుతో బూచేపల్లి వర్గం జగన్ వద్ద తన వాదన వినిపించే ప్రయత్నం చేస్తోందని జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకూ జిల్లా పార్టీ వ్యవహారాలను బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని చూడాలని జగన్ ఆదేశాలు జారీచేశారు.
వారితో పాటు అవసరం అయిన కీలక సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు వైవీ దర్శి వివాదంలో జోక్యం చేసుకోవడం.., పార్టీ కీలక నేతల మధ్య మళ్లీ వివాదాలు తలెత్తేలా చేసేలా ఉంది. వైవీ జోక్యంపై ప్రస్తుతం బాలినేని వర్గం ఇప్పుడు ఏమి మాట్లాడకుండా మిన్నకున్నా.. దర్శి వివాదం జగన్ కి వద్దకు చేరితే అన్ని విషయాలూ తన దృష్టికి వస్తాయి. అవినీతికి పాల్పడుతూ పార్టీకి తలనొప్పులు తెప్పించే వాళ్లు వెళ్లిపోవచ్చని.., అవసరం అయితే వారు పెట్టిన ఖర్చు కూడా తానే ఇస్తానని జగన్ సీరియర్ వార్నింగ్ ఇచ్చినట్లు ఆ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది.
పదే పదే చెప్పినా వినకుండా.., గతంలోని వైవీ వర్సెస్ బాలినేని పోరును తమకు అనుకూలంగా, ఒక అవకాశంగా మార్చుకునే ప్రయత్నం బూచేపల్లి, మద్దిశెట్టిలో ఎవ్వరూ చేసినా వారికి గట్టి వార్నింగ్ జగన్ నుంచి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నాయి.
చూడాలి.., ఇన్నాళ్లూ టీ కప్లో తుపానులా జిల్లాకే పరిమితం అయిన బూచేపల్లి, మద్దిశెట్టి వర్గపోరు.., వైసీపీ కీలక నేతల మధ్య కూడా వివాదాలు రాజేసేలా మారుతుందో..? లేదో అంటే..? కొన్ని రోజులు ఆగాల్సిందే..!
Also Read ;- జగన్ సైలెన్స్.. ఏపీ రైతుల ఖర్మేనా?










