లోన్ యాప్ ల రూపంలో అవసరంలో ఉన్న పేదల జీవితాలను ఛిద్రం చేసేసిన దుర్మార్గులు ప్రస్తుతం కటకటాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ దందానంతా తెరవెనుక నుంచి నడిపించిన చైనా వ్యక్తులు.. అరెస్టులు ప్రారంభం కాగానే చైనాకు పారిపోయారు. అయితే.. ఈ లోన్ యాప్ లకు ప్రధాన వ్యూహకర్తలుగా ఉండి.. రుణాల బాగోతం నడిపించిన డైరెక్టర్లను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు పోలీసులు మొదలు పెట్టారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులు లోన్ యాప్ కంపెనీల డైరెక్టర్లను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాకు చెందిన పలువురు కూడా ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. వీటిద్వారా న్యాయపరమైన చిక్కులు ఎదురై, నేరాలు జరిగి, కేసులు నమోదైనా సరే.. తమ మీదకు చిక్కులు రాకుండా చైనా కంపెనీల వారు డైరెక్టర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది.
చైనాకు చెందిన వారితో పాటు ఇండియాకు చెందిన వాళ్ళతో కంపెనీ నడుపుతూ వచ్చారు. చైనా కంపెనీలు డబ్బుల కోసం ఆశ పడి భారతీయులు కొందరు డైరక్టర్లు చేరారు. పోలీసులు ఇప్పటికే 16 కంపెనీలపై దాడులు చేసి మూసివేయించారు. ఈ కంపెనీలో ఉన్న చైనా కు చెందిన అసలు డైరక్టర్లను పట్టుకుంటే అసలు విషయాలు బయటకి వస్తాయని పోలీసులు అంటున్నారు.
Must Read ;- నైజీరియన్ల ఘరానా ఆన్ లైన్ మోసం..