ఒకప్పుడు లోన్ కావాలంటే.. బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. తీర్చడానికి తనకున్న ఆధారాన్ని చూపాలి. ఆస్తి పత్రాలు, శాలరీ పే స్లిప్పులు.. ఇలా ఒకటేమిటి.. వారు ఏది అడిగితే అది ఇవ్వాలి. ఇతరత్రా ఏ బ్యాంకులోనూ అప్పు లేదని నిరూపణ పత్రం ఇవ్వాలి. ఇలా.. అన్నీ పరిశీలించిన తర్వాత గానీ బ్యాంకులు లోన్లు ఇవ్వవు. మరి ఇప్పుడో.. ఇన్స్టెంట్ లోన్లు వచ్చేశాయి. మనం వాళ్ల చుట్టూ తిరగాల్సింది పోయి.. లోన్లు ఇస్తామంటూ వాళ్లే మన చుట్టూ తిరుగుతున్నారు. ఆన్లైన్ లోనే అన్ని పనులూ కానిచ్చేస్తున్నారు. ధ్రువ పత్రాలు అవసరం లేదు. ఆస్తి పత్రాలు అక్కరలేదు. ఎలాంటి స్యూరిటీలూ అడగరు. తిరిగి చెల్లించేందుకు నీకున్న సోర్స్ గురించి కూడా పట్టించుకోరు. వారికి కావలసింది కేవలం నీ ఫోన్ నంబర్, ఆధార్ కార్డు కాపీ. అంతే.. లోన్ ఇచ్చేస్తారు. వాళ్ల యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని.. దాన్ని ఓపెన్ చేస్తే చాలు.. మిగతా తతంగమంతా క్షణాల్లో ముగించేస్తారు. అరే.. ఇదేదో బావుందే.. లోన్ తీసుకోవడం ఇంత తేలికా.. అనుకుంటే.. ఊబిలో కాలేసినట్టే..! మీరు ఒక్కసారి వాళ్ల యాప్ ఓపెన్ చేసి.. లోన్ కోసం అప్లై చేసి.. మీ ఫోన్ నంబరు ఇస్తే చాలు.. మీ మొబైల్ లోని డేటా మొత్తం.. కాంటాక్ట్ నంబర్లతో సహా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి వ్యధ
హైదరాబాద్ కు చెందిన ఓ సాధారణ ఉద్యోగి నవీన్ (పేరు మార్చాం). 15 వేలు జీతం. ఓ ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రూ.5 వేలు రుణం తీసుకున్నాడు. లోన్ మొత్తంలో 30 శాతం కట్ చేసుకుని 3,500 నవీన్ అకౌంట్లో జమ చేసింది ఆ రుణ సంస్థ. ఆ సంస్థకు నవీన్.. వారం రోజుల్లో రూ.5 వేలు చెల్లించాలి. కానీ, గడువు ముగిసేలోగా డబ్బు చేతికి అందక.. ఆ అప్పు తీర్చలేకపోయాడు. దీంతో.. యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి మొదలైంది. గంటకోసారి ఫోన్ చేసి.. నవీన్ ను దుర్భాషలాడే వాళ్లు. మెసేజ్లు పెట్టేవాళ్లు. అతడి తల్లిదండ్రులకు, బంధువులకు, అతడి ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఫోన్లు, మెసేజ్ లు చేసి నవీన్ ను ఓ మోసగాడిగా చిత్రీకరించారు. ఈ వేధింపులు తట్టుకోలేక.. అతడు ఇదే విధంగా మరో యాప్ లో రుణం తీసుకుని ఈ అప్పు తీర్చాడు.
ఈ క్రమంలో ఒక రుణం తీర్చడానికి మరో రుణం.. అది తీర్చడానికి ఇంకో రుణం.. ఇలా చేస్తూ చేస్తూ.. వెళ్లాడు. చివరికి మొత్తం 30 యాప్ లలో 3 లక్షలకు పైగా అప్పు చేసేశాడు. దీంతో.. ఉన్నదంతా అమ్మి.. ఎలాగోలా ఓ 1.50 లక్షలు తిరిగి చెల్లించాడు. మిగిలిన సొమ్ము 1.50 లక్షలు కాస్తా.. వడ్డీతో కలిపి 2.50 లక్షలుగా మారింది. ఇక చేసేది లేక.. వారి వేధింపులు, అవమానాలు భరించలేక తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక్క నవీన్ కథ మాత్రమే కాదు. ఎందరో యువకులు ఇలాంటి మోసపూరిత యాప్ లకు బలైపోతున్నారు. యువకులు.. తమ తత్కాలిక అవసరాల కోసం వేలల్లో చేసిన అప్పులను వడ్డీతో కలిపి లక్షల్లో చెల్లిస్తున్నారు వారి తల్లిదండ్రులు. మరి కొందరు.. చెల్లించే స్థోమత లేక, వేధింపులు భరించలేక, కన్నవాళ్లకు మొహం చూపించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
మూడురోజుల్లో ముగ్గరు బలి
ఇలాంటి ఆత్మహత్యల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గడచిన మూడు రోజుల్లోనే నాలుగురు ఉసురు తీసుకున్నారు. దీంతో.. ప్రభుత్వాలు కూడా స్పందిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఒక్క సైబరాబాద్ పరిధిలోనే ఇలాంటి ఆన్‘లోన్’ సంస్థలపై 15 కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ డీజీపీ కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి ఆన్లైన్ సంస్థల పట్ల యువతను అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరారు. సీపీ సజ్జనార్ ఆదేశాలతో.. డీసీపీ రోహిణీ ప్రియదర్శిని, ఏసీపీ బాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ప్రత్యక బృందం ఈ కేసుల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది.
ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా.. యువతలో జాగురూకత పెరిగి, మార్పు రాకుంటే.. ఈ ఆన్‘లోన్’ యాప్ ల దా‘రుణాల’కు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు. ‘కష్టపడితే వచ్చే సొమ్ము కలకాలం ఉంటుంది. తేలిగ్గా వచ్చే ధనం కష్టాల పాలుజేస్తుంది’ అనే నానుడిని నమ్మి నడుచుకుంటే.. నేటి యువతరంతో పాటు వారి తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు.
Must Read ;- ఆత్మహత్యలకు దారితీస్తున్న ఆన్లైన్ అప్పులు











